ప్రజాదరణను చూసి తట్టుకోలేక పోతున్న విపక్షం


రెచ్చిపోయి బూతులు తిడుతున్నారు

అవి వినలేకే అభిమానులు రియాక్ట్‌ అవుతున్నారు
దాడులపై స్పందదించిన సిఎం జగన్‌
జగనన్న తోడు కార్యక్రమంలో విపక్ష పార్టీల తీరుపై మండిపాటు
జగనన్న తోడు కింద లబ్దిదారుల ఖాతాలో వడ్డీ జమ
అమరావతి,అక్టోబర్‌20  ( జనం సాక్షి ), : ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా రెచ్చిపోయి బూతులు తిడుతున్నారని.. తమపై ఆప్యాయత చూపే అభిమానులు వాళ్ల బూతులు వినలేక బీపీ వచ్చి రియాక్ట్‌ అవుతున్నారని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. సొంత పార్టీ దాడులపై జగన్‌ స్పందించారు. ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ప్రజల ప్రేమను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఓ వర్గం విూడియా కూడా జీర్ణించుకోలేకపోతోంది. ప్రభుత్వాన్ని దారుణంగా బూతులు తిడుతున్నారు. ఇలాంటి బూతులు ఎప్పుడూ వినలేదు. కావాలని తిట్టించి రెచ్చగొడుతున్నారు. కులాల, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. వ్యవస్థలను కూడా మ్యానేజ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనులను చూసి ఓర్వలేకపోతున్నారు. అభివృద్ధి పనులను కోర్టు కేసులతో అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి.. కుల,మత, ప్రాంతం, పార్టీలతో నిమిత్తం లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ’జగనన్న తోడు’ కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడుతూ, సంక్షేమ పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందన్నారు. ప్రతిపక్షం ఎలా తయారయిందో ప్రజలు చూస్తున్నారు. బూతులు తిడుతూ ప్రతిపక్ష నేతలు రాజకీయాలు చేస్తున్నారు. ఎవరూ మాట్లాడని బూతులను ప్రతిపక్షం మాట్లాడుతోంది. గతంలో మేం కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. ఇలాంటి బూతులు మేం ఎప్పుడూ మాట్లాడ లేదు. టీడీపీ నేతలు కావాలనే వైషమ్యాలు సృష్టించి రెచ్చగొడుతున్నారు. ప్రతిమాటలోనూ, రాతలోనూ వంచన కనిపిస్తోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కూడా టీడీపీ వెనకాడదని సీఎం అన్నారు. జగనన్న తోడు’ కార్యక్రమంలో భాగంగా లబ్దిదారుల వడ్డీ సొమ్మును బ్యాంక్‌ ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జమ చేశారు. బుధవారం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి రూ.16.36 కోట్లు లబ్ది దారుల ఖాతాల్లో జమ చేశారు. తొలి విడత ’జగనన్న తోడు’ కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4.5 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ది చేకూరనుంది. ఇప్పటివరకు 9.05 లక్షల మందికి రూ.950 కోట్ల రుణాలను ప్రభుత్వం అందించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లార చూశానని సీఎం అన్నారు. చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు, హస్తకళా వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల కళాకారులకు ’జగనన్న తోడు’ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు. వడ్డీ వ్యాపారుల చెర నుంచి చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా విముక్తి కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ ఏటా రూ.10వేల వడ్డీలేని రుణం అందిస్తున్నాం. ఇప్పటివరకు 9.05 లక్షల మందికి రూ.905 కోట్లు పంపిణీ చేశాం. ఇప్పటి వరకు సకాలంలో చెల్లించిన 4.50 లక్షల మందికి రూ.16.36 కోట్ల వడ్డీ జమ చేస్తున్నాం. ఏడాదిలో రెండుసార్లు డిసెంబర్‌, జూన్‌లో ’జగనన్న తోడు’ కార్యక్రమం నిర్వహిస్తాం. రుణాలు చెల్లించిన వారికి కొత్త లోన్లు ఇస్తాం. కొత్త రుణాలతో పాటు కట్టిన వడ్డీని వాపసు ఇస్తామని సీఎం తెలిపారు. కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహా అధికారులు పాల్గొన్నారు.