భారత ఐక్యతకు పటిష్టతకు అదే పునాది
ముంబై దాడుల్లో అమరులకు నివాళి
రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ
పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
ప్రసంగించిన ప్రధాని,రాష్ట్రపతి తదితరులు
న్యూఢల్లీి,నవంబర్26 (జనంసాక్షి): మనం మన రాజ్యాంగాన్ని అక్షరబద్ధంగా, స్ఫూర్తితో పాటిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మనం ఎటువైపు వెళ్తున్నామో, మన ప్రాధాన్యత ఏమిటి, దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలని మోడీ అన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్, టీఎంసీతో సహా 12 పార్టీలు బహిష్కరించాయి.ఈ వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. విభిన్నమైన మన దేశాన్ని.. మన రాజ్యాంగం ఏకీకృతం చేస్తుందని అన్నారు. ఎన్నో అవరోధాల తర్వాత రాజ్యాంగాన్ని రచించినట్లు ఆయన తెలిపారు. స్వతంత్రంగా ఉన్న రాష్టాల్రను మన రాజ్యాంగం ఏకంగా చేసిందని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం రోజున మన పార్లమెంట్కు సెల్యూట్ చేయాలన్నారు. ఇక్కడే అనేక మంది నేతలు తమ మేథోమథనంతో రాజ్యాంగాన్ని రచించినట్లు చెప్పారు. మహాత్మా గాంధీతో పాటు దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన ఎంతో మంది నేతలకు నివాళి అర్పిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. 1950 తర్వాత ప్రతి ఏడాది రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాల్సి ఉండె అని, రాజ్యాంగ నిర్మాణంపై ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కానీ కొందరు అలా వ్యవహరించలేదన్నారు. మన హక్కుల రక్షణ కోసం మన విధులు ఏంటో తెలుసుకోవాలన్నారు. ముంబైలో ఉగ్రదాడులు జరిగి నేటికి 14 ఏళ్లు అవుతోందని, ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు అర్పించిన సాహస సైనికులకు నివాళ్లు అర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2008లో ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించి వందలాది మంది అమాయక పౌరులను హతమార్చిన ఈరోజు 26/11 కూడా మనకు చాలా బాధాకరమైన రోజు అని ఆయన అన్నారు. ఆ రోజు మరణించిన ప్రతి ఒక్కరికీ నేను నివాళులర్పిస్తాను. ఇతరులను రక్షించడానికి తమ ప్రాణాలను అర్పించిన మన అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాను. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం.. ఈ రోజు మనం మన రాజ్యాంగం చెప్పినదంతా సమర్థిస్తున్నామా? రాజ్యాంగాన్ని మన గొప్ప నాయకులు, భారతదేశానికి స్వాతంత్యర్ర పొందిన వారు రచించారు. అయితే ఈరోజు మనం రాజ్యాంగంలోని ఒక పేజీని కూడా అనుసరిస్తున్నామా అని తర్కించుకోవాలన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని తప్పుపట్టిన ఆయన.. పార్టీ ఫర్ ద ఫ్యామిలీ.. పార్టీ బై ద ఫ్యామిలీ అన్నట్లుగా మారిందన్నారు. ఈ అంశంపై అంతకన్నా ఎక్కువగా చెప్పడం తనకు ఇబ్బందిగా ఉందన్నారు. ఒకే పార్టీ దేశాన్ని పాలించడం కానీ, ఒక పార్టీ వ్యవస్థ మొత్తం ఒకే కుటుంబం చేతుల్లో ఉండడం సరికాదన్నారు. ఒక జాతీయ పార్టీ తరతరాలు ఒకే కుటుంబం చేతుల్లో ఉంటే, అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సమస్యగా మారుతుందని ఆయన అన్నారు.కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాజకీయ పార్టీలను గమనిస్తే.. ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అన్నారు. రాజ్యాంగం చెప్తున్న దానికి ఇది విరుద్ధమన్నారు. కుటుంబాల చేతుల్లో ఉండే పార్టీల గురించి ప్రస్తావిస్తూ.. ఒక కుటుంబం నుంచి పార్టీలోకి ఎక్కువ మంది రావద్దు అన్న ఆంక్షలు ఏవీ లేవన్నారు. యోగ్యులైన వారు ఒకే కుటుంబంలో ఎందరు ఉన్నా.. ప్రజల దీవనెలు ఉంటే.. వారంతా పార్టీలో సేవ చేయవచ్చు అన్నారు. కానీ ఒక పార్టీని తరతరాలు ఒకే కుటుంబం ఏలితే, ఆ పార్టీలో ఉన్న వ్యవస్థలన్నీ ఒకే కుటుంబం వద్ద ఉంటే, అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు సంకటంగా మారుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ .. భారత రాజ్యాంగం ఆధునిక భగవత్ గీత అన్నారు. దేశం పట్ల మన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు రాజ్యాంగం మనల్ని ప్రేరేపిస్తుందన్నారు. ప్రతి ఒక్కరం దేశం కోసం పనిచేయాలని తపిస్తే, అప్పుడు మనం ఏక్ భారత్, శ్రేష్ట భారత్ను నిర్మించవచ్చు అని స్పీకర్ బిర్లా తెలిపారు. రాజ్యాంగ దినోత్సవ సంబరాలకు విపక్షాలు డుమ్మా కొట్టాయి. 14 ప్రతిపక్షాలు పార్టీలు ఆ వేడుకలకు హాజరుకాలేదు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్తో పాటు అనేక పార్టీలు ఈ వేడుకల్లో పాల్గొనలేదు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడంలేదని కాంగ్రెస్ నేత మానిక్ ఠాకూర్ ఆరోపించారు. సోమవారం నుంచి శీతాకాల సమావేశలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని 14 పార్టీలు నిర్ణయించినట్లు కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే వెల్లడిరచారు.