మెదక్, నవంబర్ 10 (జనం సాక్షి): యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్రం మెడలు వంచైనా రైతులను కాపాడుకుంటామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వరి పంటలను పండిస్తున్న రైతులకు ఇబ్బందులు పెడుతున్న కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి ఈ నెల 12న పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్రిస్టల్ గార్డెన్స్లో మెదక్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అధ్యక్షతన వహించగా, ముఖ్య అతిథిగా ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరాశ్రావుకు వైద్య ఆరోగ్య శాఖను అదనంగా అప్పగించినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని, రైతు పెట్టుబడి కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు పంటలకు రూ.10వేలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. రైతులకు పంటలపై అవగాహన కల్పించడానికి రైతు వేదికలను నిర్మించారని గుర్తు చేశారు. తెలంగాణలో రైతులు పండిరచిన పంటకు గిట్టుబాటు ధర చెల్లిస్తుందని, కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనడంలో సహకరించడం లేదన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.