శిల్పా చౌదరి చేతిలో రూ.3 కోట్లు మోసపోయిన యంగ్‌ హీరో


హైదరాబాద్‌,డిసెంబర్‌3(జనంసాక్షి): కిట్టి పార్టీల పేరుతో ప్రముఖులను మోసం చేసి కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇటీవల మహేశ్‌ బాబు సోదరి, యువ హీరో సుధీర్‌ బాబు భార్య ప్రియదర్శిని కూడా శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేశారు. 2 కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకుని, తిరిగి ఇవ్వలేదని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. తాజాగా శిల్పా చౌదరి మాయమాటలు నమ్మి హీరో హర్ష్‌ కనుమల్లి నట్టేట మునిగాడు. 3 కోట్లు నష్టపోయానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. శిల్పా పార్టీలకు అటెండ్‌ అయి ఆమె ట్రాప్‌లో పడ్డాడు ఈ యువ హీరో. ‘సెహరి’ సినిమాలో హర్ష్‌ కనుమల్లి హీరోగా నటించాడు. మరికొందరు సెలబ్రిటీలు శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా శిల్పా చౌదరిని కస్టడీలోకి తీసుకోనున్నారు నార్సింగి పోలీసులు. శిల్పా భర్త శ్రీనివాస్‌ ప్రసాద్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది రాజేంద్రనగర్‌ కోర్టు. అయితే శిల్పా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం.. 2 రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతించింది. కస్టడీకి తీసుకున్న నార్సింగి పోలీసులు శుక్రవారం, శనివారం శిల్పాను విచారించనున్నారు. శిల్పా చౌదరి బాధితులు ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల దగ్గర కోట్ల రూపాయలు తీసుకున్న శిల్పాచౌదరి.. వారికి ఫేక్‌ బంగారం, నకిలీ చెక్కులు అంట గట్టింది. హీరో సుధీర్‌బాబు భార్య ప్రియదర్శిని దగ్గర 2 కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకుని మూడు నకిలీ చెక్కులు, నకిలీ బంగారాన్ని ష్యూరిటీ కింద ఇచ్చినట్టు బయట పడిరది. చెక్కు మార్చేందుకు ఇండియన్‌ బ్యాంక్‌కు వెళ్లిన ప్రియదర్శిని.. మోసపోయినట్టు తెలుసుకుని అవాక్కయింది. దీంతో పోలీసులను ఆశ్రయించింది. ఇలా చాలామంది బాధితులు ఆమె లిస్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ, రేపు కస్టడీలో ప్రధానంగా శిల్పా బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు విచారించనున్నారు. తీసుకున్న మొత్తాన్ని ఏయే రూపాల్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్‌ చేసిందన్న వివరాలపై కూడా ఆరా తీయనున్నారు.