అమరుల స్థూపానికి తెలంగాణ వారు పనికి రారా?

  


కేసీఆర్‌కు రేవంత్‌ సూటి ప్రశ్న

హైదరాబాద్‌, డిసెంబర్‌11 (జనంసాక్షి) :  అమరుల స్థూపం కట్టడానికి తెలంగాణ వాళ్లుపనికి రారా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ని సూటిగా ప్రశ్నించారు. ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా అని అనుమానం వ్యక్తం చేశారు. అమరవీరుల స్థూపం నిర్మాణం టెండర్‌ను ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన కెపీసీ కంపెనీకి ఇచ్చారన్నారు. పిడికెడు ఏపీ కాంట్రాక్టర్లు తెలంగాణని దోచుకుంటున్నారన్న కేసీఆర్‌ ఈ ప్రాజెక్ట్‌ను ఏపీ వారికే ఎందుకిచ్చారో సమాధానం చెప్పాలని  ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఎవరూ అర్హులు లేరా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రా కాంట్రాక్టర్‌ కు ఇచ్చి అమరుల గుండెల్లో గుణపాలు దించారన్నారు.  అయినా అధికార పార్టీ ధనదాహం తీరడం లేదన్నారు. కాంట్రాక్టర్లు ఇచ్చే కవిూషన్ల కోసమే అమరుల  స్థూపం నిర్మాణం ఆంధ్రావాళ్లకు ఇచ్చారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఈ టెండర్‌ కేపీసీ ప్రాజెక్ట్‌ లిమిటెడ్‌ కు ఇచ్చిందన్నారు. ఈ కంపెనీ  పొద్దుటూరుకు చెందిన వ్యక్తిదేదన్నారు. 6 శాతం కన్‌స్టలెంట్‌ ఫీజు ఇస్తుందన్నారు.రేకులు ..ఇనుముతో కట్టిన నిర్మాణానికి 177 కోట్లకు పెంచారన్నారు.  60 కోట్లతో మొదలైన స్థూపం.. రూ.180 కోట్లకు  పెంచారన్నారు. కేటీఆర్‌ ను మెప్పించి  వ్యయం పెంచుకున్నాడన్నారు. 300 శాతం బ్జడెట్‌ పెంచారన్నారు. అమరుల స్థూపం దుస్థితి చూస్తే బాధేస్తుందన్నారు. అసలు కేసీఆర్‌ తెలంగాణ బిడ్డేనా? డీఎన్‌ఏ టెస్టు చేయించాలన్నారు. నాలుగేళ్లు అవుతున్నా  అమరుల స్థూపం ఎందుకు పూర్తికాలేదో విచారణ కమిటీ వేయాలన్నారు. ఈ కమిటీ వేసి ఆలస్యానికి కారకులైన వారిపై   క్రిమినల్‌ కేసులు పెట్టాలన్నారు.  ఆంద్రా కాంట్రాక్టర్‌ కు ఇవ్వడానికి కారణం ఏంటి? తెలియాలన్నారు. ఈ అవినీతికి  కేటీఆర్‌, అతని స్నేహితుడు తేలుకుంట్ల శ్రీధరే కారణమన్నారు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.