మంత్రి గంగుల కమలాకర్‌తో కిన్నెర వాద్యకారుడు భేటీ

 


ప్రభుత్వ సాయానికి కృతజ్ఞతలుచెప్పిన మొగులయ్య
హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి): పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య గురువారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిశారు. తెలంగాణ ప్రభుత్వం తనకు అందిస్తున్న సహకారానికి మొగులయ్య ధన్యవాదాలు తెలిపారు. గతంలో ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని ముఖ్యమంత్రి చేతుల విూదుగా అందుకోవడమే తన జీవితాన్ని మార్చిందన్నారు. ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలో తన కళను చేర్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తరపున కళాకారుల ఫించను 10వేల సహాయాన్ని తమ కుటుంబానికి  కల్పించినందుకు జీవితకాలం రుణపడి ఉంటానన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పాటను పాడి ఆలపించారు. కిన్నెర వాయిద్యాన్ని అభివృద్ధి చేసి మరిన్ని వాయిద్యాలు తయారు చేసి, కళాకారులను తయారు చేయాలనే తన లక్ష్యానికి ప్రభుత్వ సాయాన్ని అర్థించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మొగులయ్యని శాలువాతో సన్మానించి, తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేసారు. సీఎం కేసీఆర్‌ సాంస్కృతిక రంగానికి అనేక రకాలుగా అండగా ఉన్నారని, ఉద్యోగాలు సైతం ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక రంగాలను నిరంతరం ప్రోత్సహిస్తుందన్నారు. మొగులయ్యకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో సినిమా రంగానికి చెందిన డీఏం రవీందర్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.