బీసీలకు రాజ్యాధికారంతోనే న్యాయం

నిజామాబాద్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): బిసిలను అణగదొక్కుతూ ఇప్పటికీ అగ్రవర్ణాలే రాజ్యమేలుతున్నారని బీసీ సంక్షేమసంఘ నేతలు ఆరోపించారు. బీసీలకు సామాజిక భద్రత కల్పించడానికి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా బీసీ యాక్టును తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. అరవై ఏళ్ల స్వాతంత్యద్రేశంలో బీసీలకు అన్నివిధాలా అన్యాయం జరిగిందన్నారు. జనాభాప్రాతిపదికన బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరముందని చెప్పారు. చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజిర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో బీసీబిల్లును పెట్టాలని అన్నారు. ముస్లింలకు బీసీలతో కాకుండా ప్రత్యేకకోటా ద్వారా రిజర్వేషన్లు వర్తింపజేయాలని సూచించారు. ఈమేరకు కేంద్రానికి నివేదించాలన్నారు. విదేశీయులైన ఆంగ్లో`ఇండియన్లకు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా నియమిస్తున్నారని, అయితే భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని వాపోయారు. ఈ విధానం వల్ల ఇంకా ఆంగ్లో ఇండియన్లు ఇక్కడ ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు.