పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం

మొక్కల పెపంకంలో నిర్లక్ష్యం తగదు

జనగామ,డిసెంబర్‌31(జనంసాక్షి): కొత్త సంవత్సరంలో జనగామ పట్టణంమరింత అందంగా ఉండేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. ప్రభుత్వం పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజలు కూడా అందుకు బాధ్యతగా సాగాలన్నారు. దోమల నివారణకు మురుగు కాలువలు అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్‌ చేయించాలని ఆదేశించారు. రోడ్లపై చెత్త వేసేవారికి జరిమానా విధించాలన్నారు. హరితహారంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. నాటిన మొక్కల్లో ఒక్కటి ఎండినా.. దానికి సంబంధిత ప్రత్యేకాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణకు హరితహారంలో పట్టణంలో మొక్కలు నాటే టార్గెట్‌, కొత్త పురచట్టం కఠినతరంగా ఉన్న నిబంధనలు, మొక్కలు ఎండిపోతే శాఖాపరంగా తీసుకునే చర్యలు, ఇప్పటి వరకు నాటిన మొక్కలకు నీటి సరఫరా, సంరక్షణ చర్యలపై అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. తమ పరిధిలో ఒక్క మొక్క ఎండిపోయినా బాధ్యుడిపై వార్డు అధికారిపై చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు. మున్సిపల్‌ పరిధిలో ఏడాది చొప్పున ఐదేళ్ల ప్రణాళికతో కొత్త నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలని, కొద్దిరోజుల్లోనే అన్ని వార్డుల్లో పచ్చదనం పెంచేందుకు అధికారులు, విభాగాల అధికారులు పకడ్బందీ ప్రణాళికతో వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి పెరిగి పెద్దయ్యే వరకు బాధ్యుడైన ఇన్‌చార్జి అధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. వార్డుల వారిగా మొక్కలను నాటడంతోపాటు ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేయాలని, వీటి లెక్కలు పక్కాగా ఇన్‌ఛార్జిల వద్ద ఉండాలని ఆదేశించారు.