హైదరాబాద్, డిసెంబర్ 11(జనంసాక్షి) : టీఆర్ఎస్ ప్రభుత్వ పని తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో మారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వర్షకాలం పంట కొనబోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎక్కడా చెప్పలేదన్నారు. వానాకాలం పంట కొంటామని నామా నాగేశ్వర రావు ఎదుటే గోయల్ చెప్పారన్న బండి సంజయ్, వానాకాలం పంటను కేసీఆర్ ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్కు కన్పించడం లేదా అని నిలదీశారు. ప్రత్యామ్నాయ పంటల గురించి కేసీఆర్ ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. కేసీఆర్, మంత్రులు తమ బాషను మార్చుకోవాలని ఆయన సూచించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ,కాంగ్రెస్ కలిసి పోటీచేసే అవకాశముందని.. ఇద్దరి మధ్య ఒప్పందం కూడా జరిగిందన్నారు బండి సంజయ్. తాగు, ఊగు, దండుకో అనే విధంగా మద్యాన్ని ప్రోత్సహిస్తూ.. లిక్కర్ సేల్స్ ద్వారా 50 వేల కోట్ల ఆదాయం వచ్చేలా ప్లాన్ చేశారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు... భాష, యాస చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని... కేసీఆర్, కేటిఆర్ భాష మార్చుకోవాలన్నారు. రాజ్యసభ ఎంపీలపైన కేసీఆర్ కు కోపం ఉన్నట్లుందన్నారు బండి సంజయ్. అందుకే రాజ్యసభ ఎంపీలతో రాజీనామా చేయించాలని అనుకుంటున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీలు తెచ్చుకున్న ప్లకార్డ్స్ ని వాళ్లే చింపేసి.. నామా నాగేశ్వరరావు విూద పడేసి వెళ్లిపోయారన్నారు. పీయూష్ గోయల్ హౌస్ లో సమాధానం చెప్పిన తర్వాత టిఆర్ఎస్ పరువు పోయిందని.. అందుకే వాళ్ళు మాట్లాడటం లేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన బండి