మిల్లర్ల దోపిడీని అరికట్టాలి

అన్నదాతల ఆందోళన

నిజామాబాద్‌,డిసెంబరు 15 (జనంసాక్షి):-   ఆరుగాలం పండిరచిన పంటను రైస్‌మిల్‌ నిర్వాహకులు నాణ్యత, తరుగు పేరుతో నిలుపుదోపిడీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రైస్‌మిల్లర్ల మోసపూరిత వైఖరిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వడ్లను నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు పంపించినా తరుగు పేరుతో దోచుకుంటున్నారని మండిపడ్డారు. రైతులకు తెలియకుండా ఒక్కో లారీ, డీసీఎంలలో 6 నుంచి 12 సంచుల వరకు కటింగ్‌ కింద చూపి తమను మోసం చేస్తున్నారని అన్నారు. సెంటర్‌ వద్ద నాణ్యతతో ఉన్న ధాన్యం రైస్‌మిల్లు వద్దకు వెళ్లగానే నాణ్యత ఎలా కొల్పోయాయో అటు అధికారులు, ఇటు రైస్‌మిల్లర్లు చెప్పాలని అన్నారు. ఇప్పటికే అకాల వర్షాలకు పంట కొట్టుకపోయిందని మిగిలిన ధాన్యాన్ని అమ్ముకుందామంటే ఈ తరహ దోపిడీ చేస్తే తాము ఎలా బతకాలి అని ప్రశ్నించారు. రైస్‌మిల్లర్లు చేస్తున్న దోపిడీపై అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.