ఎపి పిసిసికి రేవంత్‌ లాంటి దూకుడు నేత

వడపోతలో నేతల కోసం కాంగ్రెస్‌ అధిష్టానం ఆరా

వచ్చే ఎన్నికల నాటికి సమర్థుడైన నాయకుడి కోసం అన్వేషణ
విజయవాడ,డిసెంబర్‌23 (జనం సాక్షి) : తెలంగాణలో లాగా దూకుడు కలిగిన పిసిసి నేత కోసం ఎఐసిసి అన్వేషిస్తోంది. సిఎం జగన్‌ను తట్టుకుని దూకుడు పెంచేలా ఉండే నేత కోసం అన్వేషిస్తున్నట్లుగా తెలు స్తోంది. తెలంగాణలో పిసిసి చీఫ్‌గా రేవంత్‌ రెడ్డి నియాయకం జరిగాక ఇప్పుడు పార్టీ పరిస్థితి మెరుగు పడిరది. కెసిఆర్‌ను నిలదీయగలుతున్నారు. ఎపిలో బిజెపి పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉన్నందున కాంగ్రెస్‌ బలోపేతానికి అవకాశాలు ఉన్నాయని అధిష్టానం భావిస్తుంది. అందుకే 2014 నుంచి కునారిల్లు తున్న ఏపీ కాంగ్రెస్‌పై అధిష్టానం ఫోకస్‌ పెట్టిందని అంటున్నారు. త్వరలో సారథి మారనున్నారన్న సంకేతాలు వస్తున్నాయి. రఘువీరా తరవాత సాకే శైలజానాథ్‌ను నియమించినా ఆయన మెతకగా ఉంటు న్నారు. అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంబొట్టు అన్నట్లుగా మారింది. అటు అసెంబ్లీ, ఇటు లోక్‌ సభలోనూ జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తీరా స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా హస్తవాసి బాగుంటుందా అంటే అలాంటిదేం లేదు. ఏయేటికాయేడు పార్టీ పరిస్థితి దిగజారిపోతోంది. అసలు ఎపిలో కాంగ్రెస్‌ పార్టీ వుందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీకి త్వరలో నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం జరగడం ఖాయంగా కనిపిస్తోంది.ఏపి కాంగ్రెస్‌ వ్యవహరాల పై దృష్టి సారించిన అధిష్ఠానం నేతల్ని పిలిపించుకుని మాట్లాడుతోంది. రాబోయే రోజుల్లో పార్టీని ఎలా ముందుకు నడిపించాలి? పార్టీ ని బలోపేతం చేసే దిశగా ఏఐసిసి చర్యలు చేపడుతోంది. ఏపీ ఇన్‌ఛార్జ్‌ జనరల్‌ సెక్రటరీ ఉమన్‌ చాందీని
కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్‌ ఛార్జి జనరల్‌ సెక్రటరీ ఉమన్‌ చాందీతో పాటు, ఏపీ ఇన్‌ఛార్జి సెక్రటరీలు మయ్యప్పన్‌, క్రిస్టోఫర్‌ తిలక్‌. ఈ రెండు రోజులూ పలువురు రాష్ట్ర సీనియర్‌ నాయకులతో సంప్రదింపులు జరపనున్నారు ఉమన్‌ చాందీ. త్వరలో రాహుల్‌ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి ఈ మార్పులు చేపట్టనున్నారు. తద్వారా ఏపీ కాంగ్రెస్‌ కు జవసత్వాలు నింపాలని భావిస్తున్నారని తెలుస్తోంది. 2014 రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో కాంగ్రెస్‌ పార్టీ తన ఉనికి కోల్పోయింది. 2019 ఎన్నికల్లో మరింత దిగజారింది. కనీసం నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ ఓట్లు కూడా రాలేదు. ఇటీవల జరిగిన బద్వేలు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ దారుణమయిన ఓట్లు సాధించింది. కేవలం 6,235 ఓట్లు రావడం వారితోపాటు రాజకీయ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసిందనే చెప్పాలి.
పార్టీలో చెప్పుకోదగ్గ నేతలు లేరు. నాయకత్వం అంతగా ప్రభావితం చేయలేకపోతోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి శైలజానాథ్‌ అధ్యక్షుడిగా వున్నారు. తెలంగాణ తరహాలోనే ఏపీకి కూడా రెడ్లకు చెందినవారిని అధ్యక్షుడిగా చేస్తారా ఏపీలో జగన్మోహన్‌ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనే నేతలు ఎవరనేది అధిష్టానం చర్చిస్తోంది. దీంతో కాంగ్రెస్‌ కొత్త సారథి ఎవరవుతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది పేర్లు పరిశీలనలోకి వస్తున్నాయి. అయితే దూకుడు నేత అయితేనే చాలన్న దిశగా ఆలోచిస్తున్నారు.
ఏపీసీసీ చీఫ్‌ పదవిని ఆశిస్తున్న వారిలో మాజీ ఎంపీ హర్షకుమార్‌, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, మస్తాన్‌ వలీ వున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలతో రెండు రోజుల పర్యటనలో విడివిడిగా భేటీ అయిన కాంగ్రెస్‌ వ్యవహరాల ఏపీ ఇన్ఛార్జ్‌ ఉమెన్‌ చాందీ ఈమేరకు ఒక నిర్ణయానికి రాలేకపోయారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎస్సీలకు ఇచ్చారు కాబట్టి.. ఈ దఫా ఓసీలకు పీసీసీ చీఫ్‌ పదవి కట్టబెట్టాలని పలువురు నేతలు చాందీకి సూచించారని తెలుస్తోంది. తనకు మరోసారి అవకాశమిస్తే కొనసాగేందుకు సిద్దమన్నారు ప్రస్తుత పీసీసీ చీఫ్‌ సాకె శైలజానాధ్‌. కేవీపీ, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రఘువీరా రెడ్డిలతో సంప్రదించాకే పీసీసీ చీఫ్‌ పదవిపై తుది నిర్ణయం తీసుకోవాలని మెజార్టీ కాంగ్రెస్‌ నేతల సూచించారు. ఇకపై కేవీపీ, కిరణ్‌ కుమార్‌, రఘువీరాలు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారని ఉమెన్‌ చాందీ నేతలతో చెప్పారు. 2023 నాటికి ఎన్నికలు వచ్చే అవకాశం వుండడంతో రెండేళ్ళలో పార్టీని గాడిన పెట్టేందుకు రాబోయే పీసీసీ సారథి ఏమేరకు సఫలీకృతుడు అవుతాడో చూడాలి. 2014 నుంచి కాంగ్రెస్‌ పార్టీ జవసత్వాలు లేకుండా ముందుకు సాగుతోంది. ఏపీలోని రెండు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు. కనీసం స్థానిక ఎన్నికల్లోనూ ఉనికిని చాటుకోలేక పోతోంది. ఈ నేపథ్యంలో రాబోయే కాలం కాంగ్రెస్‌ పార్టీకి గడ్డుకాలమనే చెప్పాలి. కొత్త బాస్‌ కి పార్టీని ముందుకు నడిపించడం నల్లేరు విూద బండి నడక కాబోదనే చెప్పాలి. ఐదుగురు నేతల్లో ఎవరి వైపు అధిష్టానం మొగ్గుచూపుతుందో చూడాలి.