సొంతూరుకు చేరుకున్న చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి రమణ

ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, స్థానికులు

గరికపాడు చెక్‌ పోస్టు వద్ద పూర్ణకుంభ స్వాగతం
ఎడ్లబండిపై ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకుని వెళ్లిన ప్రజలు
విజయవాడ,డిసెంబర్‌24(జనం సాక్షి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు సొంతూరులో ఘన స్వాగతం ప్రజలు,అధికారులు,నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరం చేరుకున్నారు. దీంతో గ్రామంలో పండగవాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా సందడి నెలకొంది. ఎన్వీ రమణకు స్థానికులు ఊరూరా కదలివచ్చి ఘన స్వాగతం పలికారు.. సీజే దంపతులను ఎడ్ల బండిపై ఊరేగింపుగా మేళతాళాలతో గ్రామంలోకి తీసుకెళ్లారు. పొన్నవరంలోని శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థుల పౌరసన్మాన కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజుల పాటూ ఏపీలో ఎన్వీ రమణ పర్యటించనున్నారు. శనివారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంటారు. ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందుకు హాజరవుతారు. ఆ తర్వాత సిద్దార్థ అకాడవిూలో రోటరీ క్లబ్‌లో పౌర సన్మానం స్వీకరిస్తారు. అనంతరం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చే విందుకు హాజరవుతారు. అంతకుముందు.. ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెడుతున్న సీజేఐకు అంతరాష్ట్ర చెక్‌పోస్ట్‌ గరికపాడు వద్ద ఘన స్వాగతం లభించింది. పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. వివిధ ప్రాంతాలకు చెందిన జడ్జీలు, విద్యార్థులు పుష్ప గుచ్చాలు ఇచ్చి గ్రాండ్‌ వెల్‌ కమ్‌ చెప్పారు ఎన్వీ రమణకు. సీజేఐ పర్యటన నేపథ్యంలో భారీ స్థాయిలో రెవెన్యూ పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. సొంతూరుకు బయలుదేరేముందు జస్టిస్‌ ఎన్‌.వి రమణ సూర్యాపేటలో కొంతసేపు ఆగారు. అక్కడే ఉన్న హోటల్‌లో టిఫిన్‌ చేశారు. అనంతరం హోటల్‌ సిబ్బందితో ఫోటోలు దిగారు. సూర్యాపేటకు వచ్చిన ఎన్‌.వి రమణకు జిల్లా జడ్జీలు జగ్జీవన్‌ కుమార్‌, వసంతపాటిల్‌, సురేష్‌, ప్రశాంతి, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి స్వాగతం పలికారు.