ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు

 



ప్రభుత్వ తప్పిదానికి వారు బలవుతున్నారు
నిరుద్యోగ సమస్యలై 27న ఇందిరాపార్కు వద్ద ధర్నా
ధాన్యం కొనుగోళ్లపై ఎంపిలు తోక ముడిచారు
కావాలనే సిఎం శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారు
మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌
హైదరాబాద్‌,డిసెంబర్‌18 (జనంసాక్షి):   ఇంటర్‌ ఫలితాలలో మార్కులు తక్కువొచ్చాయని ఆత్మహత్యలు చేసుకొని నూరేళ్ల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ సూచించారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఇంటర్‌ ఫలితాలలో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. దాంతో మనస్థాపానికి గురై ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు సూసైడ్‌ చేసుకున్నారు. ఈ ఘటనపై బండి సంజయ్‌ స్పందించి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ’ఇంటర్మీడియట్‌ విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దు. తమ నూరేళ్ల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. ప్రభుత్వ తప్పిదం కారణంగానే ఇంటర్‌ విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఫెయిలైన విద్యార్థుల్లో గ్రావిూణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు అధికంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. తమ చావుకు ప్రభుత్వం, కేటీఆర్‌ కారణమంటూ స్వయంగా విద్యార్ధి ట్వీట్‌ చేయడం చూస్తుంటే ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తల దించుకోవాలి. గతంలో కేటీఆర్‌ బినావిూ సంస్థ గ్లోబరీనా నిర్వాకంతో 27 మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులు బలయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి? విద్యార్థుల ఆత్మహత్యలు, పరీక్షల్లో ఫెయిలవడానికి ప్రభుత్వం బాధ్యత వహించి తీరాల్సిందే. విద్యార్థులందరికీ ఉచితంగా రీ వాల్యుయేషన్‌ చేయించాలి. ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయని పక్షంలో రాష్ట్ర
వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుంది. అవసరమైతే న్యాయపోరాటం చేసేందుకూ వెనుకాడబోం’ అని బండి సంజయ్‌ హెచ్చరించారు. తెలంగాణలో శాంతిభద్రతల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సృష్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బండి సంజయ్‌ విూడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమని కేసీఆర్‌ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. బెంగాల్‌, తమిళనాడు సహా.. పక్క రాష్టాల్రకు కేసీఆర్‌ గులాంగిరీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలుపై కేసీఆర్‌ లేని సమస్యను సృష్టిస్తున్నారన్నారు. ఒప్పందం ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌ రాజ్యసభ సాక్షిగా చెప్పారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.పార్లమెంట్‌లో ఆందోళన చేసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు తోకముడిచారెందుకు? అని ప్రశ్నించారు. బెంగాల్లో నాలుగు స్థానాల నుంచి 77సీట్లు సాధించినట్లే.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌పై కొట్లాడుతామని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు చావు డప్పులు కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు డిమాండ్‌తో ఈనెల 27న ఇందిరా పార్క్‌ వద్ద ఒక్క రోజు దీక్ష చేస్తామన్నారు.నిరుద్యోగులతో పాటు దీక్షలో పాల్గొంటానని చెప్పారు. ఉద్యోగ సంఘలా నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారో చెప్పాలి? అని నిలదీశారు.సీఎం కేసీఆర్‌ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ నియమించిన బిస్వాల్‌ కమిటీ తెలంగాణలో లక్ష 92వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తేల్చిందని బండి సంజయ్‌ తెలిపారు.