మాట మార్చిన వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌

రాహుల్‌కు ప్రధాని అయ్యే ఛాన్స్‌ ఉందటూ వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ లేకుండా విపక్ష కూటమి అసాధ్యమని వెల్లడి
గతానికి భిన్నంగా నాలుక మడతేసిన పికె
న్యూఢల్లీి,డిసెబర్‌17 (జనంసాక్షి) : కాంగ్రెస్‌లో రాహుల్‌ ఎదుగుదల అసాధ్యమంటూ..ఆయన ప్రధాని పదవి చేపట్టలేరంటూ విమర్శలు గుప్పించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ మరోసారి తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలనే రాహుల్‌ గాంధీపై పలు విమర్శలు చేసిన పీకే.. తాజాగా మాటమార్చారు. రాహుల్‌ నాయకత్వం సరిగా లేదని.. ప్రధాని ఎప్పటికీ కాలేరంటూ పేర్కొన్న ప్రశాంత్‌ కిశోర్‌.. తాజాగా మరోసారి స్వరాన్ని సవరించుకున్నారు. రాహుల్‌ గాంధీకి ప్రధాని అయ్యే అవకాశం ఉందంటూ తన నాలుకను మార్చారు. ఈ మేరకు తాజాగా ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ కిశోర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ లేకుండా కేంద్రంలో ఓ విపక్ష కూటమి ఏర్పాటు చేయడం.. మనగలగడం దాదాపు అసాధ్యమని తేల్చి చెప్పారు. అంతకుముందు కాంగ్రెస్‌ లేకున్నా.. కేంద్రంలో విపక్ష కూటమి సాధ్యమేనంటూ పీకే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ 
లేకుండా బలమైన ప్రతిపక్షం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, అయితే కేవలం పార్టీలను కూడగట్టుకోవడం ద్వారా బీజేపీని గెలుపును నియంత్రించలేమని పేర్కొన్నారు. మోదీని ఓడిరచేందుకు గట్టి సందేశం, నాయకత్వం కావాలని ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు. అంతే కాకుండా హిందుత్వ అంశం అనవసరమని.. రాహుల్‌ గాంధీ చేసిన ప్రకటనపై ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. ఈ ప్రకటన వల్ల బీజేపీకే లాభం చేకూరుతుందన్నారు. ఇకపోతే బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌, జేడీయూతో తెగదెంపులు చేసుకున్న పికె తాజాగా ఆయనతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌తో పనిచేసే అవకాశం కూడా లేదన్నారు. గాంధీ కుటుంబం లేకుండా కూడా కాంగ్రెస్‌ మనుగడ సాధిస్తుందంటూ పీకే పేర్కొన్నారు. 2017 కంటే.. యూపీలో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయంటూ పేర్కొన్నారు. దేశంలో అత్యుత్తమ నాయకుడు ఎవరని ప్రశ్నించగా.. పీకే సమాధానం చెప్పలేకపోయారు. రాహుల్‌ గాంధీ ప్రధాని కాగలరంటూ ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యానించారు. మొత్తంగా ఆయన రాజకీయ ఎత్తుగడలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. కాంగ్రెస్‌ పూర్తిగా దూరం పెట్టడంతో ఆయన మాట మార్చినట్లు అర్తం అవుతోంది. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ మళ్లీ దగ్గరకు చేర్చుకుంటుందా అన్నది చూడాలి.