ఒమిక్రాన్‌ కేసులతో అప్రమత్తం


టోలిచౌకీలో కరోనా ఆంక్షలు

హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి)  : కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్‌ పాజిటివ్‌ నిర్దారణ అయిన నేపథ్యంలో వీరిద్దరిని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిద్దరూ కూడా టోలిచౌకీ ఏరియాలో ఉంటున్నారు. సోమాలియాకు చెందిన 23 ఏండ్ల యువకుడు టోలిచౌకీలోని పారామౌంట్‌ హిల్స్‌ కాలనీలో అద్దె గదిలో ఉంటున్నాడు. వీరి కుటుంబ సభ్యులతో పాటు పారామౌంట్‌ హిల్స్‌, ఐఏఎస్‌ కాలనీలో 150 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ముందు జాగ్రత్తగా పారామౌంట్‌ కాలనీలో వైద్యులు, పోలీసులు కరోనా ఆంక్షలు విధించారు. ఒమిక్రాన్‌ కేసు నమోదుతో 25 ఇండ్ల పరిధిలో కంటైన్మెంట్‌ జోన్‌ను ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఒమిక్రాన్‌ వల్ల ప్రాణభయం లేనప్పటికీ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఆదేశించింది. వంద శాతం వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం కృషి చేస్తోంది. వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సవిూక్షలు నిర్వహించి, పలు సూచనలు చేస్తోంది.