ఆనందోత్సాహాలతో కొత్త ఏడాది సాగాలి

 శాంతిభద్రతల పరిరోణకు తోడ్పాటు ఇవ్వాలి

జిల్లా కలెక్టర్‌, కమిషనర్‌ల ఆకాంక్ష
నిజామాబాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): జిల్లా ప్రజలు కొత్త సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ప్రమాదాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, కమిషనర్‌ కార్వికేయలు సూచించారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించడం ముఖ్యమని అన్నారు. ముఖ్యంగా యువత జాగ్రత్తలు పాటించాలని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమవంతుగా సహకారం అందించాలన్నారు. శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులకు సహకరించాలని కమిషనర్‌ కారక్తికేయ అన్నారు.కొత్త ఏడాదిలో కూడా ప్రజలతో కలిసి పని చేస్తామని, సమస్యలు ఉంటే నేరుగా తమతో విన్నవించుకోవాలని అన్నారు. ఇప్పటికే ప్రజల భాగస్వామ్యం పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అధికారుల మాట, పనితీరుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వివరించారు. పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నేరాల నియంత్రణ కోసం ఇవి ఎంతగనో దోహదం చేస్తాయని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లు కూడా ఆన్‌లైన్‌ చేస్తున్నామని, ఇప్పటి వరకు 99 శాతం పూర్తి అయిందని చెప్పారు. కేసుల విచారణ వేగంగా జరగడంతో పాటు నేరస్థులకు శిక్షపడే విధంగా పర్యవేక్షణ చేసేందుకు కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రహదారి భద్రత,
ప్రమాదాల నివారణపై కార్యక్రమాలు కొనసాగిస్తామని పోలీస్‌ కమిషన్‌ పేర్కొన్నారు. మహిళలు, బాలల
రక్షణపై ప్రత్యేక నిఘాతో పాటు అవగాహన కార్యక్రమలు నిర్వహించి, వారికి ఇబ్బంది కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు ప్రభుత్వ పథకాలను అందరూ అందిపుచ్చుకుని ముందుకు సాగాలని కలెక్టర్‌ అన్నారు. హరితహారంలో వచ్చేయేడు గణనీయమైన ప్రగతికి ప్రజలు తోడ్పాటు అందించాలని కలెక్టర్‌ కోరారు. బాల్య వివాహాలను నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్‌ అన్నారు. జిల్లాలో ఇప్పటికీ ఇళ్ల వద్ద ప్రసవాలు జరుతున్నాయని, ఇది ఎంతమాత్రం మంచిది కాదని అన్నారు. ప్రతి కాన్పు ఆసుపత్రిలో జరిగేలా చూడాలని సూచించారు. కేజీబీవీల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు చర్యలు చేపట్టాలని, బాలికలకు వసతులు, సౌకర్యాలు కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలు పెంచాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కావాల్సిన నిత్యావసర సరకులు అందుబాటులో ఉంచాలని అన్నారు.