తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలు విడుదల


ఫస్టియర్‌లో 49 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి):   తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలు గురువారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఫస్టియర్‌లో 49 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ప్రకటించారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం వెబ్‌సైట్‌ను లాగిన్‌ అవొచ్చు. మార్కుల మెమోలను 17వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సెకండియర్‌ చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 3వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలకు జనరల్‌ విద్యార్థులు 4,09,911 మంది, వొకేషనల్‌ విద్యార్థులు 49,331 మంది హాజరయ్యారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 4,59,242 మంది. కాగా జనరల్‌ విద్యార్థులు 1,99,786 మంది, వొకేషనల్‌ విద్యార్థులు 24,226 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు అధికారులు వెల్లడిరచారు.