మల్లన్నసాగర్‌లో హరీష్‌ రావు కీలక భూమిక

వేదిక విూది నుంచి ప్రశంసలు కురిపించిన కెసిఆర్‌

సిద్దిపేట, ఫిబ్రవరి 23  (జనం సాక్షి):  రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశంసలు కురిపించారు. హరీశ్‌రావు డైనమిక్‌ లీడర్‌.. చురుకైన మంత్రి అంటూ కేసీఆర్‌ కొనియాడారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టును జాతికి అంకింత చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. మల్లన్నసాగర్‌ పనుల్లో చురుకుగా పనిచేశారని అన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులను గాలిలో కట్టడం సాధ్యం కాదు. భూవ్మిూదనే కట్టాలి. ముంపునకు గురైన గ్రామాలకు న్యాయం చేస్తాం. భూనిర్వాసితులకు న్యాయం చేస్తాం. చరిత్రలో ఇప్పటి వరకు ఇవ్వనటువంటి పరిహారం ఇచ్చాం. కొందరు మాత్రం పిచ్చి కార్యక్రమాలు చేశారు. కానీ వారి కుట్రలను చేదిస్తూ ముందుకు వెళ్లాం. భూములు కోల్పోయిన వారి త్యాగం వెలకట్టలేనిది. ప్రతి ఒక్కరికి నష్ట పరిహారం ఇవ్వాలి. ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం, నష్టం జరగాలని కోరుకోను. ఆసియా ఖండంలోనే ఎక్కడా లేనటువంటి పునరావాస కాలనీలు కట్టాం. అయినా వారినిఇబ్బంది పెట్టలేం కనుక మరో వందకోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. హరీశ్‌రావు డైనమిక్‌ లీడర్‌. చురుకైన మంత్రి, ఆయనకు శక్తియుక్తులు ఉన్నాయి. వారికి న్యాయం చేయడం మన ధర్మం. నిర్వాసితుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి, మంజూరు చేయాలి. ఉపాధి కలిపించేలా చర్యలు తీసుకోవాలి అని హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్‌ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి కొమురవెల్లి మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును సీఎం జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్ట్‌తో 11.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్‌.. ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం. గోదావరి జలాలను ఎత్తిపోసి 10 జిల్లాల సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నారు. అనేక వివాదాల నడుమ ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది.