మన బస్తీ`మన బడి మారనున్న రూపురేఖలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి23(ఆర్‌ఎన్‌ఎ): ’మన బస్తీ`మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. నాణ్యమైన విద్యనందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంతో పాఠశాలలకు మహర్ధశ రానుంది. పాఠశాలల్లో తాగునీటి వసతి, టాయిలెట్ల సౌకర్యం, విద్యుత్‌ సరఫరాతో పాటు విద్యార్థులకు కూర్చోడానికి బెంచీలు, టేబుల్స్‌? వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. తరగతి గదులను సుందరంగా తీర్చిదిద్ది.. భవనాలకు రంగులు వేసి ముస్తాబుచేయనున్నారు.. ఆడుకోవడానికి క్రీడా పరికరాలు అందజేసి.. విరివిగా మొక్కలు పెంచి.. పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించనున్నారు. ఇందుకుగానూ ఖైరతాబాద్‌ మండల విద్యాశాఖ అధికారులు తొలి విడత 16 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.1.26 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశారు. జూబ్లీహిల్స్‌? నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు డిప్యూటీ డీఈఓ చిరంజీవి, డిప్యూటీ ఐఓఎస్‌ రామలింగయ్య ఆధ్వర్యంలో రూ. 1.26 కోట్లతో సిద్దం చేసిన ప్రతిపాదనలను విద్యాశాఖ అధికారులు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు అందజేశారు.

ఈ బృహత్తర కార్యక్రమంతో నాణ్యమైన విద్యను అందిస్తున్న పాఠశాలలను అందుకు తగ్గట్టుగా తీర్చిదిద్దనున్నామని ఎమ్మెల్యే గోపినాథ్‌ అన్నారు. ’మన బస్తీ`మన బడి’ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఫండ్స్‌? నుంచి రూ.2 కోట్లు ఇస్తున్నామన్నారు.