కెప్టెన్‌ రోహిత్‌ అరుదైన ఘనత


వరుస టీ ట్వంటీల్లో ఘన విజయం నమోదు

లక్నో,ఫిబ్రవరి25( జనంసాక్షి ): టీ20ల్లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత కెప్టెన్‌గా రోహిత్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో లక్నో వేదికగా జరిగిన తొలి టీ20లో రోహిత్‌ పలు రికార్డులు సాధించాడు. శ్రీలంకతో జరిగిన టీ20లో ఘన విజయం సాధించిన భారత్‌ అరుదైన రికార్డు సాధించింది. టీ20ల్లో రోహిత్‌ కెప్టెన్సీలో భారత్‌కు వరుసగా ఇది పదో విజయం. దీంతో తొలిసారిగా ఈ ఘనతను భారత్‌ సాధించింది. అంతకు ముందు 2020లో టీమిండియా వరుసగా 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక టీ20 ఫార్మాట్‌లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో రోహిత్‌ రెండో స్ధానంలో నిలిచాడు. తొలి స్ధానంలో 12 విజయాలతో ఆప్గానిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ అస్గర్‌ అప్గాన్‌ ఉన్నాడు. అయితే ఈ సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండడంతో అప్గాన్‌ రికార్డును రోహిత్‌ సమం చేసే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో 44 పరుగులు సాధించిన రోహిత్‌.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు (3,307) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.