సిఎం జగన్‌తో మంత్రి పేర్ని నాని భేటీ

సినిమా టిక్కట్ల ధరలపై చర్చించారని సమాచారం

అమరావతి,ఫిబ్రవరి8(జనం సాక్షి): ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది హాట్‌ టాపిక్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని చర్చించారు. ఈ నెల 10న సీఎం జగన్‌ తో చిరంజీవి సహా ఇతర సినిమా పెద్దల సమావేశం వున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ తో సినిమటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం ను కలిసిన మంత్రి పేర్ని నాని పలు అంశాలు చర్చించారు. సినిమా టికెట్ల ధరల పెంపు అంశం ప్రస్తావనకు వచ్చింది. సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం నియమించిన కమిటీ చేసిన అధ్యయనంపై చర్చించారు.
ఈ నెల 10న సీఎం జగన్‌ తో చిరంజీవి సహా ఇతర సినిమా పెద్దల సమావేశం కానున్నారు. సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై కమిటీ నివేదిక దాదాపు సిద్దమైంది. సినిమా టికెట్ల కనీస ధర, గరిష్ట ధరలు ఎంత ఉండాలనే అంశంపై చర్చించారని తెలుస్తోంది. సినిమా ప్రముఖులతో భేటీలో వారి అభిప్రాయాలు తీసుకుని చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. సినిమా ధియేటర్ల యజమానుల సమస్య పరిష్కారంపైన చర్చ జరిగిందని తెలుస్తోంది.