వైసిపి బలోపేతానికి కృషి చేయాలి

అనుబంధ విభాగాలకు విజయసాయి సూచన

అమరావతి,మార్చి4 ( జనంసాక్షి ) :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇన్‌ఛార్జ్‌, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో విజయసాయిరెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై వారితో చర్చించి పలు సూచనలు చేశారు. వారికి దిశానిర్దేశర చేశారు. 2019 ఎన్నికల నాటికంటే వైఎస్సార్‌సీపీకి మరింతగా ఆదరణ పెరిగిందని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రతి ఎన్నికలోనూ ప్రజలు వైఎస్సార్‌సీపీని గెలిపించారు. సీఎం వైఎస్‌ జగన్‌ విధానాలతో ప్రజలలో పెరిగిన విశ్వాసమే కారణం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి
కార్యకర్తలే బలమైన పునాది. పార్టీ అనుబంధ సంఘాలు మరింత బలంగా పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ దుష్పచ్రారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని.. దీన్ని తిప్పికొట్టాలని విజయసాయిరెడ్డి అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ సూచనల మేరకు క్షేత్రస్థాయిలో ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాల ప్రకారం ముందుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ భేటీలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జ్‌ లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, చల్లా మధుసూదన్‌రెడ్డి, గౌతంరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.