యాసంగిపంట ఎందుకు కొనరు?


` కేంద్ర విధానాలపై ప్రత్యక్షపోరాటానికి సిద్ధం
` అత్యవసరంగా మంత్రులతో సీఎం కేసీఆర్‌ భేటి
` రేపు టిఆర్‌ఎస్‌ పార్టీ శాసనసభపక్ష సమావేశం
` అనంతరం ఢల్లీి వెళ్లనున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్‌,మార్చి 19(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యేక్ష పోరుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసింది. ముఖ్యంగా యాసంగి ధాన్యం కొనుగోలుకు ఆందోళనకు సిద్దమవుతోంది. గల్లీ నుంచి ఢల్లీి దాకా ఉద్యమించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఈ నెల రేపు ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించినున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేందప్రభుత్వం కచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేయనున్నట్లు కేసీఆర్‌ పేర్కొన్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం ఢల్లీి బయలుదేరి వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్ళ విూద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్‌ చేయనున్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్‌ శనివారం అత్యవసరంగా మంత్రులు, అధికారులతో ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సమావేశంలో కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరపాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్‌సభలో, రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు. పంజాబ్‌ రాష్టాన్రికి చెందిన వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నందున, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్‌ తరహాలో 100 శాతం ఎఫ్‌సీఐ సేకరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు సీఎం కేసీఆర్‌ వివరించారు. తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్య అయిన వరి ధాన్యం కొనుగోలుపై ఈ దఫా ఉధృతమైన పోరాటాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధం అవుతున్నందున ఈ సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం స్పష్టం చేశారు.