భూమయతో ఎమ్మెల్యేల అసహనం

మేయర్‌ భర్త తీరుపై ఆగ్రహంగా ఎమ్మెల్యేలు ?

నిజామాబాద్‌,మార్చి18  (జనంసాక్షి):  నిజామాబాద్‌ నగరంలోని సాయినగర్‌లో 300 గజాల స్థలం టీఆర్‌ఎస్‌లో చిచ్చు రాజేసింది. విలువైన ఈ స్థలం కోసం అధికారపార్టీ నేతలు వీధిపోరాటానికి దిగడం.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ప్రజల్లో తమ పరువు తీస్తున్నాడని మేయర్‌ భర్త తీరుపై ఎమ్మెల్యేలు మండిపడుతున్న తీరు పట్టణంలో చర్చగా మారింది. ఈ ఘటనలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్‌, బిగాల గణెళిష్‌ గుప్తలకు మేయర్‌ దండు నీతు భర్త శేఖర్‌ తీరుపై ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. భూ వివాదాల విషయంలో మేయర్‌ భర్తను ఎమ్మెల్సీ కవిత కూడా గట్టిగానే హెచ్చరించారని చెప్పుకుంటున్నారు. కానీ శేఖర్‌ తీరు మారక.. ఇప్పుడు రోడ్డెక్కడంతో అది ఎవరి మెడకు చుట్టుకుంటుందో తెలియక కలవర పడుతున్నారు. ఈ వివవాదంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి అల్లుడు సంపత్‌ పేరు ప్రస్తావనకు రావడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది. వివాదానికి కారణమైన వ్యక్తులను కూర్చోబెట్టి వాస్తవ పరిస్థితులు తెలుసుకొనే ప్రయత్నం చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. చివరకు దండు శేఖర్‌పై అసహనం వ్యక్తం చేసి.. దూకుడు తగ్గించాలని గట్టి వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. గతంలోనే ఎమ్మెల్సీ కవిత హెచ్చరించి ఉండటంతో.. తాజా రగడ పార్టీ సీనియర్ల మధ్య కొత్త వివాదాలు తీసుకురాకుండా జాగ్రత్త పడుతున్నారట. మేయర్‌ భర్త విషయంలో అంతిమ నిర్ణయం టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌కు వదిలేసినట్టు సమాచారం. ఇప్పటికే ఆలస్యమైందని.. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు అవసరమని ఎమ్మెల్యేలు సూచించారని అంటున్నారు.. నిజామాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌పై భూ వివాదాల ప్రభావం పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా దృష్టి పెట్టారని అధికారపార్టీ నేతలు చెబుతున్నారు.