మాది మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వం

 



` ఇచ్చిన హావిూ మేరకు కెసిఆర్‌ ఉద్యోగ ప్రకటన చేశారు
` ప్రతి నియోజకవర్గంలో కోచింగ్‌ సెంటర్లు పెట్టి ప్రోత్సహిస్తాం
` ఉద్యోగ ప్రకటపై మోడీ సర్కార్‌ చిత్తశుద్ది చూపలేకపోయింది
` నిమ్జ్‌లకు ఇచ్చిన సాయం గోరంతం మాత్రమే
` అసెంబ్లీలో విమర్శలు గుప్పించిన మంత్రి కెటిఆర్‌
హైదరాబాద్‌,మార్చి 10(జనంసాక్షి): తెలంగాణలో సిఎం కెసిఆర్‌ ప్రకటించినట్లుగా బిజెపి కేంద్రంలో ఎందుకు ఉద్యోగ ప్రకటన చేయలేక పోయిందని శాసనసభలో మంత్రి కెటిఆర్‌ నిలదీసారు. కెసిఆర్‌ కొలువుల ప్రకటనపై విమర్శలు చేస్తున్న బిజెపి నేతలు దీనికి సమాధానం చెప్పాలన్నారు. మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. బీజేపీ నేతల మాటలు కోట్లలో ఉంటాయి.. పనులేమో పకోడిలా ఉంటాయి. నరం లేని నాలుక కదా ఇషల్టమొచ్చినట్లు మాట్లాడుతారని అసెంబ్లీ వేదికగా అన్నారు. ఒకేసారి 80,039 ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిన సందర్భంగా యావత్‌ తెలంగాణ యువత తరపున సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నానని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. ఇది కొలువుల జాతర కాదు.. కొలువుల కుంభమేళా అని పేర్కొన్నారు. శాసనసభలో సభా నాయకుడిగా సీఎం అధికారికంగా ప్రకటించారు. ఉత్కంఠతో చూసిన ఉద్యోగ అభ్యర్థులు సంబురాలు చేసుకున్నారు. విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులు చదువులో మునిగిపోయారు. ప్రధాన పార్టీలకు చెందిన ఓ ఇద్దరు నాయకులు సీఎం ప్రకటన నమ్మం అని స్టేట్‌మెంట్‌ చేశారు. కేసీఆర్‌ ప్రకటన నమ్ముతాం అనే వారు చదువుల్లో నిమగ్నమయ్యారు. నమ్మం అనే వారు మోదీ ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. రెండు పారిశ్రామిక సమూహాలను కేంద్రం నిమ్జ్‌గా గుర్తించింది. ఒకటి జహీరాబాద్‌, రెండో హైదరాబాద్‌ ఫార్మా సిటీలను నిమ్జ్‌గా గుర్తించారు. దీనికి బ్రహ్మాండమైన మద్దతు వచ్చి, వేల కోట్ల నిధులు వస్తాయని, కోట్ల ఉపాధి అవకాశాలు వస్తాయని ఆశించాం. 2016లో జహీరాబాద్‌ నిమ్జ్‌కు గుర్తింపు ఇచ్చింది.. ఆరేండ్లలో కేవలం రూ. 3 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఫార్మా సిటీకి నిమ్జ్‌ అని పేరు పెట్టి 2017లో జీవో ఇచ్చింది. ఈ ఐదేండ్లలో రూ. 5కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? అని అడుగుతున్నాను. ఇకపోతే కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి, పిల్లలకు భోజన సదుపాయాలు కల్పిస్తామని పలువురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సభ వేదికగా తెలిపారు. ప్రభుత్వ ప్రకటన విూద విశ్వాసం ఉంటే, యువత విూద ప్రేమ ఉంటే.. ప్రతి నియోజకవర్గంలో కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు. భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబు కూడా ఈ విషయంలో చొరవ చూపాలని కేటీఆర్‌ సూచించారు. టీ శాట్‌ ద్వారా పోటీ పరీక్షలకు కోచింగ్‌ ఇస్తున్నాం. మాటలతో ఎద్దెవా చేయడం మంచిది కాదు. ప్రభుత్వ రంగంలో లక్ష ఉద్యోగాలు వస్తాయని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. గత టర్మ్‌లో లక్షా 32 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేశాం. నిన్నటి ప్రకటనతో ఆ సంఖ్య 2 లక్షల 47 వేలకు చేరువైంది. నినాదాలు ఇవ్వకుండా.. అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని కేటీఆర్‌ చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా కేటీఆర్‌ ప్రసంగించారు. మేం కేవలం నినాదాలు ఇవ్వలేదు. ఫిట్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా అనేక అందమైన నినాదాలు బీజేపీ ఇస్తది. కానీ దాని వెనుకాల పాలసీలు ఉండవు. కరోనా సమయంలో పరిశ్రమలు మూతపడ్డాయి. ఆత్మనిర్భర్‌ కింద రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పింది. దీంతో దేశంలోని పరిశ్రమలకు లాభం జరుగుతందని అనుకున్నాం. ఆ ప్యాకేజీ ఎక్కడ పోయిందో తెలవదు. అవి నోటి మాటలే. నాకు తెలిసీ ఒక్కరంటే ఒక్కరూ కూడా లాభం పొందలేదు. బీజేపీవి పచ్చి బోగస్‌ మాటలు అని కేటీఆర్‌ మండిపడ్డారు. భారతదేశంలోని కొత్త రాష్ట్రమైన తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలోనే ఈ విషయం వెల్లడైందన్నారు. భౌగోళికంగా 11వ పెద్ద రాష్ట్రం. జనాభా పరంగా 12వ అతిపెద్ద రాష్ట్రం. కానీ భారతదేశ ఆర్థిక రంగానికి 4వ అతిపెద్ద చోదక శక్తిగా ఉందని ఆర్బీఐ నివేదికలో తేలిందన్నారు. ఇది కేసీఆర్‌ ప్రభుత్వ ఘనతనే అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2 లక్షల 78 వేలు(130 శాతం) పెరిగిందని కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి. జీఎస్‌డీపీ రూ. 11 లక్షల 54 వేల కోట్లు.. ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏదైనా ఉందా? అని కేటీఆర్‌ అడిగారు. కానీ ఇది కొందరికి నచ్చడం లేదు. తెలంగాణ పచ్చబడుతుంటే.. కండ్లు ఎర్రబడుతున్నాయి. రాజకీయంగా పుట్టగతులుండవని భయపడుతున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు.

 

హరిత పరిష్కారాలలో తెలంగాణ ముందంజ
కార్బన్‌ ఉద్గారాల నెట్‌ జీరో సాధనకు ప్రభుత్వాలతో ప్రైవేటు రంగం కలిసిరావాలి
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం రీజినల్‌ యాక్షన్‌ గ్రూప్‌ సదస్సులో మంత్రి కేటీఆర్‌ ప్రసంగం
తెలంగాణ ప్రభుత్వం క్లీన్‌ ఎనర్జీ సంబంధిత పాలసీలను వివరించిన మంత్రి
హైదరాబాద్‌,మార్చి 10(జనంసాక్షి):వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నిర్వహించిన 9వ రీజినల్‌ యాక్షన్‌ గ్రూప్‌ సదస్సులో మంత్రి కే .తారకరామారావు ఈరోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఊపందుకున్న ప్రస్తుత ఇంధన వనరులు మరియు విద్యుచ్ఛక్తి నుంచి గ్రీన్‌ పవర్‌ దిశగా గ్రీన్‌ ట్రాన్సిషన్‌ దిశగా పెట్టుకున్న లక్ష్యాలను అందుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగం కలిసి పని చేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ లక్ష్యాలను పూర్తి చేయాలంటే భారీ ఎత్తున పెట్టుబడులు అవసరమని, ఇందుకు సంబంధించి ప్రభుత్వాలు, పాలసీల నిర్మాణం వాటి అమలు విషయంలో మరింత వేగంగా ముందుకు పోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రీన్‌ ట్రాన్సిషన్‌, క్లీన్‌ ఎనర్జీ వైపు తెలంగాణ రాష్ట్రం చురుగ్గా ముందుకు పోతున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సోలార్‌ పవర్‌ పాలసీ మరియు ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఎలక్ట్రిక్‌ స్టోరేజ్‌ సొల్యూషన్స్‌ పాలసీ రాష్ట్రంలో గ్రీన్‌ విద్యుత్‌ మరియు గ్రీన్‌ సొల్యూషన్స్‌ వైపు తెలంగాణను తీసుకుపోతున్నదని కేటీఆర్‌ అన్నారు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో కేవలం 3.5 శాతం మాత్రమే ఉన్న తెలంగాణ రాష్ట్రం దేశం ఉత్పత్తి చేసే సోలార్‌ విద్యుత్‌ శక్తి లో 4.2 గిగా వాట్ల సామర్థ్యంతో 10.30 శాతం కలిగి ఉండడం, గ్రీన్‌ సొల్యూషన్స్‌, క్లీన్‌ ఎనర్జీ పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని కేటీఆర్‌ తెలిపారు. రానున్న సంవత్సరంలో సుమారు ఆరు గిగ వాట్ల స్థాయికి రాష్ట్రంలో సోలార్‌ ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం ఇంధన అవసరాలకోసం సోలార్‌, విండ్‌ ఎనర్జీ, మరియు ఎలక్ట్రిక్‌ వాహనం రంగం పైన ఫోకస్‌ చేస్తూనే హరితహారం అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకుపోతున్నదని తెలిపారు. ఒకవైపు కార్బన్‌ ఏమిషన్లను తగ్గించడంతో పాటు ఫారెస్ట్‌ కవర్‌ ని పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ ప్రయత్నంలో డ్రోన్‌ పాలసీ తీసుకువచ్చి డ్రోన్లతో సీడ్‌ బాంబింగ్‌ చేస్తూ, హరిత కవర్‌ పెంచేందుకు టెక్నాలజీని ఆసరాగా తీసుకుంటున్నామని తెలంగాణ చేపట్టిన పలు కార్యక్రమాలను ఉదాహరించారు. ప్రపంచం వేగంగా కార్బన్‌ ఉద్గారాల విషయంలో నెట్‌ జీరో స్థాయిని సాధించాలంటే ఈ రంగంలో ఇన్నోవేషన్‌ ను, స్టార్టప్లకు చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. నెట్‌ జీరో స్థాయిని సాధించేందుకు క్లీన్‌ ఎనర్జీ వనరులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దీంతోపాటు గ్రీన్‌ సొల్యూషన్‌ లను పట్ల విద్యారంగంలో మార్పులు చేయడం ద్వారా అవగాహన కల్పించేందుకు అవకాశం ఉందని, ఆ దిశగా తాము ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం అధ్యక్షుడు బోర్గ్‌ బ్రాండె అధ్యక్షత వహించిన ఈ వర్చువల్‌ సదస్సుకి బంగ్లాదేశ్‌ మాల్దీవ్స్‌, యూఏఈ వంటి దేశాల మంత్రులతోపాటు పలు వాహన, ఇంధన రంగ కంపెనీల అధినేతలు పాల్గొన్నారు.