ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాడ వివాదాస్పద వ్యాఖ్యలు


విద్యార్థి నవీన్‌ మృతదేహం రప్పించడంపై అసహనం

బెంగళూరు,మార్చి4 ( జనంసాక్షి ) :  కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాడ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో మరణించిన నవీన్‌ శేఖరప్ప మృతదేహాన్ని ఎప్పుడు తీసుకువస్తారని ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ.. విమానంలో శవపేటికను తీసుకువస్తే ఎక్కువ స్థలం అవసరం వస్తుందని, దానికి
బదులుగా పది మందిని తీసుకురావచ్చు అని ఆయన అన్నారు. రష్యా దాడిలో చనిపోయిన నీవన్‌ మృతదేహాం కోసం ఇంట్లో వాళ్లు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేసిన ప్రశ్నకు ఎమ్మెల్యే ఆ జవాబు ఇచ్చారు. నవీన్‌ మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ఉక్రెయిన్‌లో ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉందని, ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని గుర్తిస్తారని, విద్యార్థులను తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, నవీన్‌ పార్దీవేహాన్ని తీసుకువస్తామని ఎమ్మెల్యే అరవింద్‌ తెలిపారు. ప్రాణాలతో ఉన్నవారిని తీసుకురావడం ఇబ్బందిగా ఉందని, ఇక డెడ్‌బాడీని తీసుకురావడం ఇంకా కష్టం అవుతుందని, దీనికి బదులుగా పది మందిని తీసుకురావచ్చని ఎమ్మెల్యే అన్నారు. కర్నాటకలోని హూబ్లీ`ధార్వాడ్‌ నియోజకవర్గం నుంచి అరవింద్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.