వరి కొనుగోళ్లలో ఇబ్బందులు రాకుండా చర్యలు


నిజామాబాద్‌,అక్టోబర్‌27 ( జనం సాక్షి); వరి కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులకు గిట్టుబాటు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. జిల్లాలో వానాకాలం సీజన్‌ వరి కోతలు మొదలయ్యాయి. వ్యవసాయ భూముల్లో సాగు చేసిన వరి పంటలు కోతకు వచ్చాయి. కోతకు వచ్చిన పంటలను కోసేం దుకు రైతులు బీజీ అయ్యారు. ఇప్పటికే కొందరు రైతులు వరి కోతలను ప్రారంభించారు. కోత మిషన్‌లు సైతం గ్రామాల్లోని పంట పొలాలకు చేరుకున్నాయి జిల్లాలో ఈ వానాకాలం లో వరి ధాన్యం కొనుగోళ్ల కోసం 343 కేంద్రా లను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 312 పీఏసీఎస్‌లు, 21 ఐకేపీ, 10 మార్కెటింగ్‌ కమిటీ ల ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వరి ధాన్యం సేకరణకు 1.50 లక్షల గన్నీ బ్యాగులు అవసరమని అంచనా వేశారు. ఇప్పటికే 90 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలకు అవసర మైన ప్యాడి క్లీనర్‌, తేమశాతం కొలిచే యంత్రాలు, ఎలక్టాన్రిక్‌ కాంటలు, గన్నీ సంచులు సిద్ధం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఒక్కో కొనుగోలు కేంద్రం వద్ద ముగ్గురు సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో గతంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు ట్రాన్స్‌పోర్ట్‌ ఇబ్బందులు తలెత్తడంతో ఈ అనుభావాలను దృష్టిలో పెట్టుకుని ఏడాది నుంచి ధాన్యాన్ని తరలించేందుకు క్లస్టర్‌ లుగా విభజించారు.