నదీజలాలపై గెజిట్‌అమలు వాయిదా వేమాలి


నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనం సాక్షి): నదీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ అమలును వాయిదా వేయాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ కోరారు. ఈ నెల 14 నుంచి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమల్లోకి రానుందని, దానిని కొద్దికాలంపాటు వాయిదా వేయాలన్నారు. గోదావరి నదిపై ఉన్న పెద్దవాగు బోర్డు పరిధిలోకి వెళ్తుందని చెప్పారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశంలో దీనిపై చర్చిస్తామన్నారు. పెద్దవాగు పరిధిలో రెండు వేల ఎకరాల ఆయకట్టు తెలంగాణకు, 13 వేల ఎకరాల ఆయకట్టు ఆంధప్రదేశ్‌కు ఉందన్నారు. ఏపీ కోరుతున్నట్లు మిగతా ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని చెప్పారు. ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని, గెజిట్‌ అమలుకు గడువు కావాలని కోరారన్నారు. ప్రస్తుతం గోదావరి బోర్డు పరిధిలోకి ఒక్క పెద్దవాగు మాత్రమే వస్తుందని చెప్పారు. సబ్‌కమిటీ నివేదికలపై చర్చిస్తామన్నారు.