ఉపాధి పథకాలకు ప్రభుత్వ ప్రోత్సాహం : మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

హైదరాబాద్‌,నవంబర్‌29((జనం సాక్షి): స్వయం ఉపాధి పొందుతున్న యువతను ప్రోత్సహించేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. సోమవారం మంత్రి తలసాని తన కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ తో కలిసి వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 17 మంది దివ్యాంగ లబ్దిదారులకు 20 లక్షల రూపాయల విలువైన సబ్సిడీ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కిరాణం, జిరాక్స్‌, సెల్‌ ఫోన్‌, టెంట్‌ హౌస్‌, ఫోటో స్టూడియో తదితర రంగాలలో స్వయం ఉపాధి పొందుతున్న వారిని ప్రోత్సహించేలా 60 నుండి 70 శాతం సబ్సిడీ పై ప్రభుత్వం ప్రభుత్వం రుణాలను అందిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లబ్దిపొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం ఏడీ రాజేందర్‌, నోడల్‌ ఆఫీసర్‌ కృష్ణ, ఎఫ్‌ఆర్‌ఓ పవన్‌ తదితరులు పాల్గొనారు.