బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ల వినూత్న ధర్నా

ఏలూరు, నవంబర్‌30(జనం సాక్షి) : నరసాపురం మున్సిపాలిటీ పరిధిలో చేసిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మంగళవారం స్థానిక మున్సిపాలిటీ ఎదుట చేతులను తాళ్లతో కట్టుకు వినూత్నంగా ధర్నా నిర్వహించారు. బకాయిలు చెల్లించి కాంట్రాక్టర్ల కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. బకాయిలు పేరుకుపోవడంతో అప్పులకు వడ్డీలు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు. తక్షణం బకాయిలను విడుదల చేసి కాంట్రాక్టర్లను ఆదుకోవాలని కోరారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం మేనేజర్‌ శిరిగినీడి శివాజీకి వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంట్రాక్టర్లు అడబాల బాబులు, బెల్లంకొండ నాగేశ్వరావు, గోరు సత్తిబాబు, ఎర్రంశెట్టి పార్థసారథి ఎం.వసంతరావు, వై.బాబూరావు, మనోహర్‌ గుప్త, సుంకర రంగా, ఏడిద దొరబాబు ఉన్నారు.