ఉద్యమకారులకు గాలం వేసిన బిజెపి

ఎన్ని చేపలుపడతాయో అని ఎదురుచూపు

ఉద్యమకారులను చేర్చుకోవడం ద్వారా విమర్శలకు పదను బిజెపి

తాజా వ్యూహం అమలుకు రంగంలోకి దిగిన నేతలు

హైదరాబాద్‌,డిసెంబర్‌10(జనంసాక్షి): తెలంగాణలో ఇతర పార్టీ నేతలను ఆకర్షించే విషయంలో బీజేపీ దూకుడుగా ఉంది. ప్రధానంగా ఉద్యమకారులను బిజెపిలో చేర్చుకోవాలన్న బలమైన ప్లాన్‌ కనబరుస్తోంది. ఉద్యమకారులను చేర్చుకోవడం ద్వారా సిఎం కెసిఆర్‌పైనా, టిఆర్‌ఎస్‌పైనా విమర్వలు ఎక్కుపెట్టాలన్నది వ్యూహంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రానున్న రెండేళ్ల కోసం ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో వెళుతున్న బిజెపి తమ ఇమేజ్‌ను పెంచుకునేందుకు ఉద్యమకారులకు గాలం వేస్తోంది. ఇప్పటికే ఈటెల రాజేందర్‌ , స్వామిగౌడ్‌, రాములమ్మ, విఠల్‌, దిలీప్‌ కుమార్‌ లాంటి వారంతా చేరారు. తాజాగా తీన్మార్‌ మల్లన్నను కూడా చేర్చుకున్నారు. ఈ క్రమంలో ఉద్యమకారులను పార్టీలోకి ఆహ్వానించడం..దీనిపై టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ ఎదురుదాడికి దిగడం కూడా జరిగిపోయింది. బీజేపీలో చేరికలపై తెలంగాణలో మళ్లీ చర్చ మొదలైంది. అప్పట్లో కీలక నాయకులతో వరసగా మంతనాలు సాగించి.. కొందరిని తమ పార్టీలో చేర్చుకున్నారు కమలనాథులు. మధ్యలో ఈ పక్రియకు బ్రేక్‌ వచ్చింది. ఇప్పుడు మళ్లీ గాడిలో పెట్టింది.  ముఖ్యంగా హుజురాబాద్‌ ఉపఎన్నికలో ఈటెల రాజేందర్‌ గెలిచాక రెండో దశ చేరికలు మొదలుపెట్టినట్టు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే విఠల్‌,తీన్మార్‌ మల్లన్నలు చేరారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లకు చెందిన రెండు డజన్ల నేతలు తమతో టచ్‌లో ఉన్నారని.. ఆ మధ్య బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లోనూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేరికల గురించి మాట్లాడారు. కేవలం ఎమ్మెల్యేలు.. ఎంపీలు చేరితేనే చేరినట్లు కాదని.. జిల్లా స్థాయిలో కాషాయ కండువా కప్పుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. . దీంతో వివిధ పార్టీలకు చెందిన పెద్ద లీడర్లే కాకుండా.. చోటామోటా నాయకులను కూడా బీజేపీలోకి ఆహ్వానించాలనే ఆలోచనకు వచ్చినట్టు కిషన్‌రెడ్డి మాటలను బట్టి అర్థంచేసుకోవచ్చు. దీంతో ఇకపై కిందిస్థాయిలో చేరికలు జోరందుకుంటాయని అనుకుంటున్నారు. బీజేపీ జిల్లా శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సైతం.. బీజేపీలో చేరికలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. కరీంనగర్‌లో మాజీమేయర్‌ రవీంద్రసింగ్‌ బిజెపిలో చేరం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోఈటీ చేయడం టిఆర్‌ఎస్‌కు మింగుడుపడని వ్యవహారం. అలాగే పార్టీని వదిలి వెళ్లిన వారిని సైతం తీసుకురావాలని యోచిస్తున్నారు.  ముఖ్యంగా ఉద్యమకారులను, అధికారపార్టీలో అసంతృప్తితో ఉన్నవాళ్లను.. టచ్‌లో ఉన్న వివిధ వర్గాల ప్రముఖులను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తోంది.  ఢల్లీి బీజేపీ పెద్దలు కూడా ఈ విషయంలో ఈటలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. పిసిసి చీఫ్‌గా రేవంత్‌ నియామకం తరవాత కాంగ్రెస్‌లో కొంత ఊపు కనిపించింది. అయితే హుజూరాబాద్‌లో పార్టీ ఘోర వైఫల్యంతో దూకుడు తగ్గింది. అయినా రేవంత్‌ పార్టీ కోసం గట్టిగానే కృషి చేస్తున్నారు. ఇకపోతే కాంగ్రెస్‌ నుంచి వచ్చిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సైతం గతంలోనే కొందరు కాంగ్రెస్‌ నేతలు.. మాజీ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపారని సమాచారం.  తర్వాత జరిగిన పరిణామాలతో ఆపరేషన్‌ మధ్యలోనే ఆగింది. ఇప్పుడు డీకే అరుణ మళ్లీ తన పని మొదలుపెట్టినట్టు సమాచారం. మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యోగ సంఘాల మాజీ నేత విఠల్‌, జర్నలిస్ట్‌లు బీజేపీలో చేరిపోయారు. వారి చేరిక వెనక తాజా రాజకీయ పరిస్థితులు.. సామాజికవర్గాల ప్రభావం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.