ధాన్యం అమ్మకాల్లో తిరకాసుఆందోళనలో అన్నదాతలు

కాకినాడ,డిసెంబర్‌11 (జనంసాక్షి) : ధాన్యం ఎంత ఉన్నా రైతుల నుంచి కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా పరిస్తితులు ఉన్నాయి. దీంతో ధాన్యాన్ని ఎవరికి అమ్మాలో తెలియక  రైతులు అయోమయానికి గురవుతున్నారు. గ్రామంలోని రైతుల ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాం సిబ్బంది సూచనల మేరకు స్థానిక రైస్‌మిల్లుకు తరలించినప్పటికీ కొందరి రైతులకు చెందిన సర్వేనెంబర్లు అనుసంధానం కాకపోవడం వల్ల ధాన్యాన్ని కొనుగోలు చేయలేకపోతున్నట్టు మిల్లర్లు చెబుతున్నారు. దీంతో తాము ధాన్యాన్ని ఎవరికి అమ్మాలో తెలియడంలేదని రైతులు వాపోయారు.  ప్రభుత్వ ఆన్‌లైన్‌ సమాచారం పూర్తిగా బ్లాక్‌ అయినందున మిల్లర్లు కొనుగోలు చేసేందుకు అవరోధంగా మారింది. ఈ విషయాన్ని జేసి.సుమిత్‌ కుమార్‌ దృష్టికి తీసుకువెళ్లగా రెండురోజుల్లో పరిష్కరిస్తామని రైతులకు హావిూ ఇచ్చి నా నెరవేరలేదు. దీంతో మిల్లర్లు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయలేక పోతున్నారు. మిల్లులకు తీసుకువస్తే తమకు బాధ్యత లేదని మిల్లర్లు చెబుతుండడంతో ధాన్యానికి రక్షణ ఎలా అని రైతులు అంటున్నారు. సకాలంలో కొనుగోళ్ల సాగక సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.