రాజీవ్‌ హత్య కేసులో నళినికి పెరోల్‌ మంజూరు

 


తల్లి ఆరోగ్యం చూసుకునేందుకు కోర్టు అనుమతి
చెన్నై,డిసెంబర్‌24(జనం సాక్షి): రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన నళినీ శ్రీహరన్‌ కు పెరోల్‌ లభించింది. యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న నళినికి తమిళనాడు ప్రభుత్వం పెరోల్‌ మంజూరు చేసినట్లు మద్రాస్‌ హైకోర్టు తెలిపింది. నళిని తల్లి ఎస్‌ పద్మ దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ గురువారం విచారణకు రాగా.. న్యాయమూర్తులు పీఎన్‌ ప్రకాశ్‌, ఆర్‌ హేమలతతో కూడిన డివిజన్‌ బెంచ్‌ కు రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హసన్‌ మహ్మద్‌ నళిని తల్లి ఆరోగ్యంపై తెలిపారు. ఆ పిటిషన్‌లో తాను వివిధ వ్యాధులతో బాధపడుతున్నానని, తన కుమార్తెను తన మంచం పక్కన ఉండాలని పద్మ కోరింది.
ఒక నెల పాటు పెరోల్‌ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు వినతిపత్రాలు పంపగా.. మొత్తానికి ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ మే 21, 1991న శ్రీపెరంబుదూర్‌లో ఎల్టీటీఈ ఆత్మాహుతి బాంబు దాడిలో మృతి చెందారు. ఈ హత్య కేసులో మురుగన్‌, సంతన్‌, పెరరివాలన్‌, జయకుమార్‌, రాబర్ట్‌ పయస్‌ తోపాటు రవిచంద్రన్‌, నళిని అనే ఏడుగురు వ్యక్తులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.