హెలికాప్టర్‌ కూలిన స్థలంలోనే బ్లాక్‌బాక్స్‌ పోరెన్సిక్‌ బృందం గుర్తించి స్వాధీనం


చెన్నై,డిసెంబర్‌9(జనంసాక్షి ):  తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్‌ వద్ద భారత వాయుసేనకు సంబంధించిన హెలికాప్టర్‌ కూలిపోయిన కొదిª`ది దూరంలో బ్లాక్‌ బాక్స్‌ లభ్యమయ్యాయి. హెలికాప్టర్‌కు సంబంధించిన బ్లాక్‌బాక్స్‌ను తమిళనాడు ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగానికి చెందిన బృందం గుర్తించినట్లు గురువారం ప్రకటించింది. ప్రమాదం జరిగిన స్థలం నుంచి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్‌ లభ్యమైంది. అనంతరం బ్లాక్‌బాక్స్‌ను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకొని, వెల్లింగ్టన్‌ బేస్‌ క్యాంప్‌కు తరలించారు. వింగ్‌ కమాండర్‌ ఆర్‌ భరద్వాజ్‌ నేతృత్వంలోని 25 మంది సభ్యుల వైమానిక బృందం బ్లాక్‌బాక్స్‌ కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. బ్లాక్‌బాక్స్‌ను వెల్లింగ్టన్‌ నుంచి ఢల్లీికి తరలించి, అందులో ఉన్న డేటాను డీకోడ్‌ చేయనున్నారు. బ్లాక్‌ బాక్స్‌లో 13 గంటల పాటు నిడివి ఉన్న డేటా నిక్షిప్తమై ఉంటుంది. క్రాష్‌ అయిన సమయంలో ప్రమాదానికి ముందు ఏం జరిగిందన్న సమాచారాన్ని బ్లాక్‌ బాక్స్‌ అందివ్వనున్నది. సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, సహా 14 మంది ప్రయాణిస్తున్న ఐఏఎఫ్‌కు చెందిన హెలికాప్టర్‌ బుధవారం తమిళనాడులోని కూనూర్‌లో కూలిపోయిన విషయం తెలిసిందే. జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ హెలికాప్టర్‌ ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉన్నది. అలాగే ప్రమాదానికి ముందు పైలెట్లు జరిపిన సంభాషణ సైతం రికార్డయ్యే అవకాశాలుంటాయి. హెలికాప్టర్‌ ప్రమాద దర్యాప్తులో బ్లాక్‌ బాక్స్‌ కీలకం కానున్నది.