ఏడాదికి 15 వేల మంది క్యాన్సర్ రోగులకు ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు

 

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం

 హైద‌రాబాద్: ప్ర‌భుత్వ రంగంలో పేద‌ల‌కు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. ఆరోగ్య శ్రీ కింద క్యాన్స‌ర్ చికిత్స‌కు ప్ర‌భుత్వం ప్ర‌తి ఏడాది రూ. 100 కోట్లు ఖ‌ర్చు చేస్తోంద‌ని మంత్రి తెలిపారు. నిమ్స్‌, ఎంఎన్‌జే ఆస్ప‌త్రుల్లో క్యాన్స‌ర్ రోగుల‌కు మెరుగైన వైద్య సేవ‌లందిస్తున్నామ‌ని తెలిపారు. ఏడాదికి 15 వేల మంది క్యాన్సర్ రోగులకు ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంద‌ని అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.


వ‌ర‌ల్డ్ క్యాన్స‌ర్ డే సంద‌ర్భంగా ఎంఎన్‌జే క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిలో మంత్రి హ‌రీశ్ రావు సీటీ స్కాన్‌, డెంటల్ ఎక్స్‌రే ఓపీజీ, పెషేంట్ అటెండెన్సీ భ‌వ‌నంతో పాటు మొబైల్ స్ర్కీనింగ్ వాహ‌నాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడారు.

14 సంవ‌త్స‌రాల క్రితం ఏర్పాటైన సీటీ స్కాన్ ఏర్పాటు చేయ‌డం లేద‌ని చెప్ప‌డంతో రూ. 7 కోట్ల 16 ల‌క్ష‌ల‌తో అధునాత‌న సీటీ స్కాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని తెలిపారు. క్యాన్స‌ర్ రోగుల‌ను గుర్తించేందుకు రోట‌రీ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో రూ. కోటితో అందుబాటులోకి తీసుకొచ్చిన మొబైల్ స్ర్కీనింగ్ వాహ‌నాన్ని ప్రారంభించామ‌న్నారు. స‌ర్వైక‌ల్, బ్రెస్ట్, ఓర‌ల్ క్యాన్స‌ర్‌ను గుర్తించేందుకు ఈ వాహ‌నం ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. నీనారావు చారిట‌బుల్ ట్ర‌స్టు ద్వారా డాక్ట‌ర్ గోవింద్ రావు రూ. 3 కోట్ల‌తో 300 ప‌డ‌క‌ల‌ పేషెంట్ అటెండెన్సీ భ‌వ‌నాన్ని నిర్మించారు. ఈ భ‌వ‌నం ఈ రోజు నుంచి అందుబాటులోకి వ‌స్తుంది. ఇక్క‌డ రూ. 5 భోజ‌న సౌక‌ర్యం క‌ల్పిస్తాం. రూ. 40 ల‌క్ష‌ల‌తో డెంట‌ల్ ఎక్స్‌రే ఓపీజీని ప్రారంభం చేసుకున్నామ‌ని తెలిపారు. ఈహెచ్ఎస్, సింగ‌రేణి, ఆర్టీసీ ఉద్యోగుల‌తో పాటు ఇత‌ర ఉద్యోగుల అవ‌స‌రాల నిమిత్తం రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 3 కోట్ల‌తో నిర్మించిన‌ 24 గ‌దుల స్పెష‌ల్ బ్లాక్‌ను ప్రారంభించామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు.


ఎంఎన్‌జే క్యాన్స‌ర్ బ‌డ్జెట్ రెట్టింపు 


తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఎంఎన్‌జే క్యాన్స‌ర్ బ‌డ్జెట్‌ను సీఎం కేసీఆర్ రెట్టింపు చేశారని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. ఈ ఆస్ప‌త్రికి 252 పోస్టుల‌ను కొత్త‌గా మంజూరు చేశారు. 32 మంది డాక్ట‌ర్లు 85 మంది స్టాఫ్‌న‌ర్సులు, 85 మంది టెక్నిషీయ‌న్ల‌ను మంజూరు చేశాం. రోగులు పెరుగుతున్న నేప‌థ్యంలో అర‌బిందో ఫార్మా వారు సీఎస్ఆర్ ప్రోగ్రాం కింద రూ. 65 కోట్ల‌తో 300 ప‌డ‌క‌లతో కొత్త‌గా ఆస్ప‌త్రిని నిర్మిస్తున్నారు. ఇది ఏప్రిల్ నెల‌లోగా అందుబాటులోకి రానుంది. ప్ర‌స్తుత‌మున్న 450 బెడ్స్‌కు అద‌నంగా ఈ 300 బెడ్స్ వ‌స్తే 750 ప‌డ‌క‌ల‌కు అప్‌గ్రేడ్ చేసుకోబోతామ‌ని మంత్రి తెలిపారు. ఎంఎన్‌జేకు స‌మీపంలోని రెండు, మూడు ఎక‌రాల స్థ‌లాన్ని కూడా క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌కు అందించాల‌ని కోరారు. ఆ స్థ‌లాన్ని ఎంఎన్‌జే ఆస్ప‌త్రికి కేటాయిస్తామ‌ని తెలిపారు.


మార్చి నెల‌ఖారులోగా అందుబాటులోకి రోబోటిక్ థియేట‌ర్ 


ఎంఎన్‌జేలో ప్ర‌స్తుతం 3 ఆప‌రేష‌న్ థియేట‌ర్లు ఉన్నాయి. ఏడాదికి 4000 మైన‌ర్ స‌ర్జ‌రీలు, 1500 మేజ‌ర్ స‌ర్జ‌రీలు చేస్తున్నారు. రూ. 15 కోట్ల‌తో 8 అధునాత‌న ఆప‌రేష‌న్ థియేట‌ర్ల‌ను నిర్మించ‌బోతున్నాం. ఈ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. మార్చి నెల‌ఖారులోగా ఈ థియేట‌ర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఒక‌టి రోబోటిక్ థియేట‌ర్ అందుబాటులోకి రానుంది. దీంతో 5 వేల వ‌ర‌కు స‌ర్జ‌రీలు చేసే అవ‌కాశం ఉంది అని మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.


ప్ర‌పంచాన్ని క్యాన్స‌ర్ ప‌ట్టిపీడిస్తోంది.. 


క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి ఈ దేశాన్ని, ప్ర‌పంచాన్ని ప‌ట్టిపీడిస్తోంది. క్యాన్స‌ర్‌ను నిర్మూలించేందుకు చాలా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. క్యాన్స‌ర్ ట్రీట్‌మెంట్ చికిత్సా విధానాలు మెరుగు అవుతున్నాయి. వైద్యులు ఎన్నో నూత‌న వైద్య విధానాల‌తో క్యాన్స‌ర్ రోగుల‌ను బ‌తికిస్తున్నారు. ప్ర‌పంచ‌, దేశ వ్యాప్తంగా క్యాన్స‌ర్ వ్యాధిగ్ర‌స్తుల సంఖ్య పెరిగుతూ పోతోంది. 100 ర‌కాల క్యాన్స‌ర్ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తించారు. ప్ర‌తి ఏటా కూడా ఈ సంఖ్య బాగా పెరుగుతుంది. గ‌త 30 ఏండ్ల‌లో 50 శాతం క్యాన్స‌ర్ కేసులు పెరిగిన‌ట్లు తెలుస్తోంది. ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న‌శైలి, గుట్కా, మ‌ద్య‌పానం, పొగాకు వ‌ల్ల కూడా క్యాన్స‌ర్ సంభ‌విస్తోంది. జ‌న్యుప‌రంగా కూడా ఈ వ్యాధి సంక్ర‌మిస్తున్న‌ట్లు తేలింది. ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న‌శైలిని మార్చుకోవ‌డం ద్వారా క్యాన్స‌ర్‌ను నిరోధించొచ్చు అని అధ్య‌య‌నాల్లో తేలింది అని హ‌రీశ్‌రావు చెప్పారు.


గుట్కా, సిగ‌రెట్‌కు దూరంగా ఉండాలి.. 


ప‌దేండ్ల వ‌య‌సు నుంచే బీడీ, సిగ‌రెట్ తాగ‌డంతో త‌న‌కు ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ వ‌చ్చింది అని ఓ రోగి తెలిపిన‌ట్లు హ‌రీశ్‌రావు మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు. త‌న‌కు ఓ బిడ్డ ఉంది. ఇప్పుడు మేం రోడ్డున ప‌డ్డాం. చిన్న వ‌య‌సులోనే బీడీలు, సిగ‌రెట్ తాగాన‌ని బాధ‌ప‌డుతున్నాడు. బీడీలు, సిగ‌రెట్లు తాగి పెద్ద త‌ప్పు చేశాన‌ని అత‌ను బాధ‌ప‌డిన‌ట్లు హ‌రీశ్‌రావు తెలిపారు.


40 ఏండ్లు దాటిన వారంద‌రికీ స్ర్కీనింగ్ నిర్వ‌హిస్తాం.. 


క్యాన్స‌ర్ ప‌ట్ల‌ ప్ర‌జ‌ల్లో చైత‌న్యం, అవ‌గాహ‌న పెర‌గాలి అని హ‌రీశ్‌రావు అన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు ప్ర‌తి పీహెచ్‌సీ స్థాయిలో క్యాన్స‌ర్ స్ర్కీనింగ్ చేస్తున్నాం. ప్రాథ‌మిక ద‌శ‌లో క్యాన్స‌ర్‌ను గుర్తిస్తే నివారించొచ్చు. వైద్యారోగ్య సిబ్బందిని కూడా ట్రైన్ చేయ‌బోతున్నాం. 40 ఏండ్లు దాటిన వారంద‌రికీ స్త్రీనింగ్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించాం. దీన్ని త్వ‌ర‌లోనే అమ‌లు చేస్తామ‌న్నారు. క్యాన్స‌ర్‌పై ప్ర‌జ‌ల్లో లోతైన అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాం. నోటి, గొంతు క్యాన్స‌ర్ల‌తో పాటు బ్రెస్ట్, గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్లు వ‌స్తున్నాయి. క్యాన్స‌ర్‌ను నివారించ‌డానికి, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న తెచ్చేందుకు ప్ర‌త్యేక‌మైన కార్య‌క్ర‌మాలు చేప‌డుతామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.