స్టార్టప్‌ కంపెనీలకు పన్ను రాయితీలు పొడిగింపు

సహకరా సంఘాల సర్‌ఛార్జీ 7శాతానికి తగ్గింపు

న్యూఢల్లీి,ఫిబ్రవరి1 (జనం సాక్షి):   కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ, స్టార్టప్‌ కంపెనీలకు పన్ను రాయితీని మరో ఏడాది పొడిగించినట్లు తెలిపారు. మాన్యుఫ్యాక్చరింగ్‌కు కన్సెషనల్‌ ట్యాక్స్‌ కొనసాగుతుందన్నారు. స్టేట్‌ ఎంప్లాయీస్‌కు ట్యాక్స్‌ డిడక్షన్‌ను 14 శాతానికి పెంచినట్లు చెప్పారు. రూ.1 కోటి నుంచి రూ.10 కోట్ల వరకు ఆదాయంగల సహకార సంఘాలకు సర్‌ఛార్జీని 7 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌ ట్రాన్సాక్షన్స్‌పై పన్ను విధించనున్నట్లు తెలిపారు. వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్లు చెప్పారు. దేశంలో నాలుగు ప్రాంతాల్లో లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలాసీతారామన్‌ తెలిపారు. పన్ను ఎగవేతను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్రిప్టో వంటి డిజిటల్‌ ఆస్తుల పెట్టుబడులు పెరుగుతుండటంతో దీన్ని పన్ను పరిధిలోకి కేంద్రం తీసుకువచ్చింది. క్రిప్టో కరెన్సీ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్లు నిర్మల సీతారామన్‌ చెప్పారు. లాంగ్‌ టెర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌పై 15 శాతం పన్ను విధిస్తామన్నారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. ఇక ఆదాయపన్ను రిటర్నుల్లో పొరపాట్లను సవరించుకునేందుకు దరఖాస్తు చేసిన ఏడాది నుంచి రెండేళ్లలో మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ పేర్కొన్నారు.