నేడు జిల్లాలో వసంతపంచమి వేడుకలు

పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

కరీంనగర్‌,ఫిబ్రవరి4(జనంసాక్షి ): చదువుల తల్లి, సంగీత సాహిత్యాల అభినేత్రి సరస్వతీదేవికి ప్రీతికరమైన మాఘశుక్ల పంచమిని మంగళవారం వసంత పంచమిగా జరుపుకోనున్నారు. సరస్వతీ మాతను పుస్తకాది రూపాల్లో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్ర ప్రమాణం. వాక్కు, ప్రజ్ఞ, మేధస్సు, ధారణ, స్ఫురణ, బుద్ధి, చదువు వంటివి సిద్ధిస్తాయని వేదాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. విశిష్టదినమైన వసంతపంచమి నాడు సరస్వతీ పూజ చేస్తారు. ఉపవాసాలు పాటిస్తూ విద్యలో ఉన్నతి ప్రసాదించమని అర్చిస్తారు. అక్షరాభ్యాసాలు, పలకలు, పుస్తకాలు, పెన్నులను దానాలు చేస్తారు. పెద్దవారు, ఉపాసకులు, దీక్షాపరులు తమ గురువులు, సన్యాసులు, మఠాధిపతులు, బ్రాహ్మణుల నుంచి ఉపదేశాలు స్వీకరిస్తారు. పలు సరస్వతీ ఆలయాల్లో అభిషేక అర్చనలు, ప్రత్యేక పూజలు, పల్లకి సేవలు నిర్వహిస్తారు. వసంతపంచమి గొప్ప ముహూర్తపురోజే అయినా శుక్రమూఢం కారణంగా శుభకార్యాలు మాత్రం జరుపుకోగూడదని పండితులు చెబుతున్నారు. అమ్మవారికి పూజలు, అభిషేకాలు మాత్రం యధాతథంగా నిర్వహించుకోవచ్చని పేర్కొంటున్నారు. కరీంనగర్‌లోని చైతన్యపురి మహాశక్తిఆలయం, బొమ్మకల్‌రోడ్‌ వరాహస్వామిక్షేత్రంలో గల త్రికూటాలయం, గాయత్రినగర్‌లోని గణెళిశశారదాశంకరాలయాల్లో సామూహిక అక్షరాభ్యాసాలు జరుగనున్నాయి.