ప్రెస్‌ క్లబ్‌ ఎన్నికల్లో దౌర్జన్య ప్రకరణం

 



ప్రజాస్వామ్యాన్ని గొంతు నులిమే ప్రహసనం
ఓడిపోయిన అధ్యక్ష అభ్యర్థి సృష్టించిన అయోమయం
రిటర్నింగ్‌ అధికారులకు బెదిరింపులు
ప్రత్యర్థులపై గుర్తుతెలియని వ్యక్తుల దాడులు
వీడియో ఆడియో ఆధారాలు లభ్యం
కేసు నమోదు, దర్యాప్తు షురూ
దౌర్జన్యంగా అడ్డుకుని, బ్యాలెట్‌ బాక్సుల్లో నీళ్లు పోశారు..
సూరజ్‌పై పోలీస్‌లకు ఫిర్యాదు చేసిన ఎన్నికల అధికారి..
ప్రెస్‌క్లబ్‌లో ఎన్నికల్లో సూరజ్‌ దౌర్జన్యాలపై పోలీస్‌ కేసు
హైదరాబాద్‌,మార్చి 14(జనంసాక్షి):ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో 80 ఓట్ల తేడాతో ఓటమి పాలైన తర్వాత తమను బెదిరించి, పత్రాలను లాక్కొని, బ్యాలెట్‌ బాక్సుల్లో నీళ్లు పోసిన సూరజ్‌ వి భరద్వాజపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు హేమసుందర్‌రావు, రంగాచార్యలు సోమవారం పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. అనేక దఫాలుగా ప్రెస్‌క్లబ్‌ ఎన్నికలను నిజాయితీగా నిర్వహించి, ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించామని, అధ్యక్ష పదవికి పోటీ చేసిన సూరజ్‌ భరద్వాజ 80 ఓట్లతో ఓటమి పాలైన అనంతరం, తిరిగి ఓట్లను లెక్కించాలని కోరితే రెండుమార్లు లెక్కించామని, 80 ఓట్ల తేడాలో ఏ మార్పు లేదని తెలుసుకుని, స్వస్తిక్‌ గుర్తులు సరిగ్గా లేవని, దొంగ ఓట్లు వేశారన్న నింద మోపుతూ తనపై దౌర్జన్యపూర్వకంగా వ్యవహరించి , ఎన్నికల పత్రాలు లాక్కొని, బలవంతంగా తమను నిర్బంధించి ఎన్నికల ప్రకటన నిలుపుదల చేయాలని సంతకాలు చేశారని ఫిర్యాదు చేశారు.ఈ విషయంలో వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి, సూరజ్‌తో పాటు ప్రెస్‌క్లబ్‌ సభ్యులు కాని వారి వివరాలు,సీసీ ఫుటేజీతో పాటు,వీడియో రికార్డులను పోలీస్‌ అధికారులకు హేమసుందర్‌రావు సోమవారం సాయంత్రం సమర్పించారు.